
- ప్రధాన కార్యాలయాలు, కలెక్టరేట్లు, బస్స్టాండ్లలో ఏర్పాటు
- రెండేండ్లలో 150 క్యాంటీన్ల ఏర్పాటు లక్ష్యం
- వివరాలు వెల్లడించిన సీఎస్ శాంతికుమారి
హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలో మహిళా శక్తి క్యాంటీన్లను ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాలతో వీటిని ఏర్పాటు చేయనున్నట్లు సీఎస్ శాంతికుమారి వెల్లడించారు. మహిళా శక్తి క్యాంటీన్ సర్వీస్ లపై గురువారం సెక్రటేరియెట్లో సీఎస్ రివ్యూ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. రాష్ట్రంలో మహిళా సంఘాలను ఆర్థికంగా బలోపేతం చేయాలన్న సీఎం ఆదేశాల మేరకు మహిళా శక్తి క్యాంటీన్లను తీసుకువస్తున్నామన్నారు. అన్ని ప్రధాన కార్యాలయాలు, కలెక్టరేట్లు, పర్యాటక ప్రాంతాలు, దేవాలయాలు, బస్ స్టాండ్లు, పారిశ్రామిక ప్రాంతాల్లో మహిళా సంఘాల నిర్వహణలో ఈ క్యాంటీన్లను ఏర్పాటు చేస్తామన్నారు. రానున్న రెండేండ్లలో కనీసం 150 క్యాంటీన్లను ఏర్పాటు చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నామని వెల్లడించారు.
ఈ క్యాంటీన్ల నిర్వహణను మహిళా సంఘాలకు అప్పగిస్తామని సీఎస్ అన్నారు. క్యాంటీన్ల నిర్వహ ణపై మహిళా సంఘాలకు ప్రత్యేక శిక్షణ కూడా ఇస్తామని చెప్పారు. క్యాంటీన్ల పనితీరు, నిర్వహణ, వీటి ఏర్పాటుకు ఎంత విస్తీర్ణంలో స్థలం అవసరం, వీటి ఏర్పాటుకు రోడ్ మ్యాప్ తదితర అంశాలపై సవివరంగా ప్రణాళికను రూపొందించాల్సింగా గ్రామీణాభివృద్ధి, పంచాయతీ రాజ్ శాఖ కమిషనర్ను సీఎస్ శాంతికుమారి ఆదేశించారు. రివ్యూలో రెవెన్యూ శాఖ ముఖ్య కార్యదర్శి నవీన్ మిట్టల్, పంచాయతీ రాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ కమిషనర్ అనితా రామచంద్రన్, ఆరోగ్య శాఖ కమిషనర్ కర్ణన్, దేవాదాయ శాఖ కమిషనర్ హనుమంత రావు, టూరిజం శాఖ డైరెక్టర్ నిఖిల, టూరిజం కార్పొరేషన్ ఎండీ రమేశ్ నాయుడు పాల్గొన్నారు.