సర్కారు కాలేజీలపై నమ్మకం పెరిగింది.. 85 వేలు దాటిన ఫస్టియర్ అడ్మిషన్లు

సర్కారు కాలేజీలపై నమ్మకం పెరిగింది.. 85 వేలు దాటిన ఫస్టియర్ అడ్మిషన్లు
  • ఇంటర్ విద్యాశాఖ డైరెక్టర్ అభిలాష అభినవ్ 

హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలోని గవర్నమెంట్ జూనియర్ కాలేజీలపై విద్యార్థులు, తల్లిదండ్రుల్లో నమ్మకం పెరిగిందని, అందుకే ఈ ఏడాది అడ్మిషన్లు పెరుగుతున్నాయని ఇంటర్ విద్యాశాఖ డైరెక్టర్ అభిలాష అభినవ్ అన్నారు. సోమవారం హైదరాబాద్‌‌లోని ఇంటర్ బోర్డు కమాండ్ కంట్రోల్ సెంటర్‌‌లో జిల్లా అధికారులు, ప్రిన్సిపాళ్లకు నిర్వహించిన ఓరియంటేషన్ ప్రోగ్రామ్‌‌లో ఆమె మాట్లాడారు. 

ఈ విద్యా సంవత్సరంలో ఇంటర్ ఫస్టియర్‌‌లో యూడైస్ ప్లస్​లో నమోదైన లెక్కలే ఏకంగా 85,453 మంది విద్యార్థులు చేరారని, గత ఏడాదితో పోలిస్తే ఇది 14 శాతం వృద్ధి అని పేర్కొన్నారు. ప్రస్తుతం ఇంటర్మీడియేట్​లో రెండేండ్లు కలిపి 1,64,730 మంది చదువుతున్నారని చెప్పారు. కాలేజీల్లో మౌలిక వసతుల కల్పన కోసం సమగ్ర శిక్ష నిధులను పక్కాగా వినియోగిస్తున్నామని అభిలాష అభినవ్ తెలిపారు. 

ఆర్థిక వ్యవహారాల్లో పారదర్శకత కోసం స్పర్శ్ పోర్టల్‌‌ను వాడుతున్నామని, దీనిపై ప్రిన్సిపాళ్లకు పూర్తి అవగాహన కల్పించామన్నారు. కంప్యూటర్ ల్యాబ్స్ కోసం రూ. 20 కోట్లు, ఆధునిక టాయిలెట్ల నిర్మాణం కోసం రూ. 1.9 కోట్లు, క్రీడల ప్రోత్సాహానికి రూ. 1.04 కోట్లు కేటాయించినట్లు చెప్పారు.  విద్యార్థులకు కేవలం చదువే కాకుండా, ఉపాధి అవకాశాలు కల్పించడమే లక్ష్యంగా ఐబీఎం , హెటెరో  వంటి దిగ్గజ సంస్థలతో ఒప్పందాలు కుదుర్చుకున్నామని డైరెక్టర్ వెల్లడించారు. దీనివల్ల 2వేల మందికి పైగా విద్యార్థులకు ప్లేస్‌‌మెంట్లు, స్కిల్ ట్రైనింగ్ అందనుందని, ఒక్క హెటెరో సంస్థే 300 మందికి ఉద్యోగాలిస్తామని హామీ ఇచ్చిందని తెలిపారు.