సర్కారు స్కూళ్లు.. కూల‘బడి’పోతున్నయ్..

సర్కారు స్కూళ్లు.. కూల‘బడి’పోతున్నయ్..

సిటీలో ఒకే రోజు రెండు స్కూళ్లు నేలమట్టం

లాక్ డౌన్ తో తప్పిన ప్రమాదం

హైదరాబాద్, వెలుగు: సిటీలో సర్కారు స్కూళ్లు కనీన మరమ్మతుల్లేక కూలిపోతున్నాయి. ప్రతి వానాకాలం ఏదో ఒకచోట ఇలాంటి ప్రమాదాలు జరుగుతున్నా పట్టించుకునేవారు కరువయ్యారు. సుల్తాన్ బజార్ లో 1866లో నిర్మించిన గవర్నమెంట్ స్కూల్ బిల్డింగ్ పైకప్పు గురువారం ఉదయం కూలింది. సికింద్రాబాద్ కంటోన్మెంట్ బోర్డు పరిధిలో 57 ఏండ్ల కిందట నిర్మించిన ప్రైమరీ స్కూల్ బిల్డింగ్ పైకప్పు కూడా అదే రోజు నేలమట్టం అయింది. లాక్ డౌన్ తో పిల్లలు లేకపోవడం వల్ల ప్రమాదం తప్పింది. సుల్తాన్ బజార్ స్కూల్ లో వందమందికి పైగా, కంటోన్మెంట్ బోర్డులోని ప్రైమరీ స్కూల్ లో దాదాపు 300 మంది విద్యార్థులు చదువుకుంటున్నారు. సుల్తాన్ బజార్ లోని ప్రభుత్వ పాఠశాల భవనం 12 ఏండ్ల కిందటే శిథిలావస్థకు చేరింది. 2008లో కొంత భాగం కూలిపోయింది. 2009, 2010, 2013లో పైకప్పు కొంత కిందపడడంతో కూలిన ప్రాంతంలో వదిలి, మిగతా గదుల్లో క్లాస్లు కండక్ట్​ చేస్తున్నారు. స్కూల్స్ నడిచే రోజుల్లో విద్యార్థులు కూలిన బిల్డింగ్ ఏరియా కింది నుంచే టాయిలెట్ కు వెళ్తుంటారు.

అన్నీ సమస్యలే..

సిటీలో 182 హైస్కూల్స్, 8 అప్పర్ ప్రైమరీ స్కూల్స్ , 600 దాకా ప్రైమరీ స్కూల్స్ ఉన్నాయి. వాటిల్లో 124 స్కూళ్లు ప్రైవేట్ బిల్డింగ్స్ లోనే కొనసాగుతున్నాయి. మిగతా వాటికి పక్కా భవనాలున్నా, 40 దాకా శిథిలావస్థలో ఉన్నాయి. మరికొన్ని ఆలయాల్లో నిర్వహిస్తున్నారు. చాలా స్కూల్లకు కరెంట్ ఫెసిలిటీ లేదు. ప్రహరీల్లేవు. ప్రతి వానాకాలం ఏదో ఒక బిల్డింగ్ కూలుతున్నా పట్టించుకునేవారు కరువయ్యారు. కనీసం మరమ్మతులు కూడా చేయించడం లేదు.

రిపేర్లు లేకనే..

సిటీలోని ప్రభుత్వ పాఠశాలల్లో కనీస వసతులు కరువయ్యాయి. 40 దాకా స్కూళ్లు శిథిల భవనాల్లో నడుస్తున్నాయి. మరమ్మతులు లేకనే సుల్తాన్ బజార్, కంటోన్మెంట్ బోర్డు స్కూళ్లు కూలిపోయాయి. లాక్ డౌన్ వల్ల ప్రాణ నష్టం జరగలేదు. పాఠశాలలు నడిచే రోజుల్లో అయితే, ఊహించకుంటేనే భయమవుతోంది. శిథిలావస్థలో ఉన్న స్కూల్ బిల్డింగ్ ను వేరొక చోటుకు మార్చడమో, మరమ్మతులు చేయడమో చేయాలి. -ఎ.శ్రీనివాస్, టీయూటీఎఫ్ జిల్లా అధ్యక్షుడు.