సూర్యాపేట/యాదాద్రి, వెలుగు : స్కూళ్లు స్టార్ట్ అయి రెండు నెలలు కావొస్తున్నా స్టూడెంట్లకు పుస్తకాలు మాత్రం పూర్తిస్థాయిలో అందలేదు. ఆఫీసర్లు బడిబాట కార్యక్రమం నిర్వహించడంతో పాటు, ఈ సంవత్సరం నుంచి సర్కార్ స్కూళ్లలో ఇంగ్లిష్ మీడియం ప్రవేశపెట్టడంతో స్టూడెంట్లు భారీ సంఖ్యలో పెరిగారు. అయితే పెరిగిన స్టూడెంట్లకు అనుగుణంగా బుక్స్ సరఫరా జరగకపోవడంతో ఇబ్బందులు ఎదురవుతున్నాయి. వచ్చిన అరకొర బుక్స్, పాత పుస్తకాలతోనే నెట్టుకొస్తున్నారు.
కొన్ని బుక్సే వచ్చినయ్..
సూర్యాపేట జిల్లాలో 950 సర్కార్ స్కూళ్లు ఉండగా 73,580 మంది స్టూడెంట్స్ ఉన్నారు. వీరికి 5.20 లక్షల పుస్తకాలు అవసరం ఉంది. కానీ ఇప్పటివరకు జిల్లాకు 3,25,120 పుస్తకాలు మాత్రమే వచ్చాయి. వీటిలో 2,97,990 బుక్స్ను పంపిణీ చేయగా ఇంకా 29,130 బుక్స్ పంపిణీ చేయాల్సి ఉంది. అయితే ఇంగ్లిష్, ఉర్దు మీడియానికి సంబంధించిన పుస్తకాలు ఇంకా రాలేదు. తెలుగు మీడియంకు సంబంధించినవి కొన్ని మాత్రమే స్కూళ్లకు అందాయి. అలాగే యాదాద్రి జిల్లాలో 712 స్కూల్స్ ఉండగా వాటిలో 52,125 మంది స్టూడెంట్స్ ఉన్నారు. వీరికి 4.76 లక్షల బుక్స్ అవసరం. ఇందులో ఇప్పటివరకు 3.28 లక్షలు రాగా 2.98 లక్షల బుక్స్ను పంపిణీ చేశారు. మొత్తం 142 టైటిల్స్ ఉండగా వీటిలో ఇప్పటివరకు 105 టైటిల్స్ వచ్చాయి. ఉర్దూ, సంస్కృతంతో పాటు ఒకటి నుంచి ఐదో తరగతి వరకు ఒక్కో తరగతిలో మ్యాథ్స్, ఇంగ్లిష్, తెలుగు బుక్స్ మొత్తమే రాలేదు.
పాత పుస్తకాలతోనే బోధన
స్కూళ్లకు వచ్చిన అరకొర బుక్స్తో పాటు, గతేడాది పుస్తకాలతోనే టీచర్లు విద్యాభోదన కొనసాగిస్తున్నారు. ఈ సంవత్సరం నుంచి ఇంగ్లిష్ మీడియం ప్రవేశపెట్టడంతో పుస్తకాలు తెలుగు, ఇంగ్లిష్లో ప్రింట్ అయి రావాల్సి ఉంది. కానీ అవి ఇంకా అందకపోవడంతో టీచర్లు పాత పుస్తకాల్లోని పాఠాలను ట్రాన్స్లేట్ చేస్తూ బోర్డుమీద రాస్తున్నారు. బెంచీకి ఒక స్టూడెంట్కు కొత్త పుస్తకం ఇచ్చి అందరూ అందులోనే చూసుకుంటూ చదవాలని చెబుతున్నారు. దీంతో స్టూడెంట్లు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. సూర్యాపేట జిల్లా చివ్వెంల మండలం బండమీది చందుపట్ల మండల పరిషత్ స్కూల్లో 26 మంది స్టూడెంట్లు ఉండగా 16 మందికే ఇంగ్లిష్ బుక్స్ ఇచ్చారు. చింతలపాలెం మండలం చింత్రియాల ఎంపీయూపీఎస్లో 5వ క్లాస్ వరకు ఒక్కో టైటిల్ బుక్ మాత్రమే స్కూల్కు చేరింది. తుంగతుర్తి నియోజకవర్గంలోని మొత్తం ప్రైమరీ స్కూల్స్లో క్లాస్కు ఒక బుక్ చొప్పున సరఫరా చేశారు. హుజూర్నగర్ మండలం లింగగిరి హైస్కూల్లో 104 మంది స్టూడెంట్లు ఉండగా ఇప్పటివరకు ఒక్కరికి కూడా బుక్స్ అందలేదు. యాదాద్రి జిల్లా భువనగిరి గంజ్ హైస్కూల్లో 6వ తరగతిలో 60 మంది స్టూడెంట్లు ఉంటే 30 మందికి సరిపడా పుస్తకాలే వచ్చాయి. ఆలేరు హైస్కూల్లో 6, 7, 8 తరగతులకు చెందిన ఇంగ్లిష్, సోషల్, హిందీ, మ్యాథ్స్, ఫిజిక్స్ బుక్స్ అందలేదు.
స్టూడెంట్లు ఇబ్బంది పడుతున్రు
బుక్స్ రాకపోవడంతో స్టూడెంట్లు ఇబ్బంది పడుతున్నరు. హోంవర్క్ ఇవ్వలేక పోతున్నం. పాత తెలుగు మీడియం బుక్స్ చూసి పాఠాలు చెబుతున్నాం.
– పాలకోటి గోపి, హెచ్ఎం, చింత్రియాల
వారం రోజుల్లో వస్తాయి
మరో వారం రోజుల్లో పూర్తి స్థాయిలో పుస్తకాలు వస్తాయి. స్టూడెంట్స్కు ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకుంటున్నం. సూర్యాపేట జిల్లాకు ఇప్పటివరకు 3.25 లక్షల బుక్స్ వచ్చాయి. త్వరలోనే బుక్స్ అందేలా చూస్తాం.
– అశోక్, డీఈవో, సూర్యాపేట