హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాలలను బలోపేతం చేయాలని, వచ్చే విద్యాసంవత్సరంలో విద్యార్థుల నమోదు (ఎన్రోల్మెంట్) భారీగా పెంచాలని అధికారులను పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్ నవీన్ నికోలస్ ఆదేశించారు. ఏ స్కూల్లోనూ టీచర్ల కొరత ఉండకూడదని, టీచర్లను సర్దుబాటు చేసి ఈ సమస్యను పరిష్కరించాలని సూచించారు.
గురువారం జూబ్లీహిల్స్లోని ఎంసీఆర్హెచ్ఆర్డీలో ఆర్జేడీలు, డీఈఓలు, డైట్, సీటీఈ, ఐఏఎస్ఈ ప్రిన్సిపాళ్లకు ఏర్పాటు చేసిన రెండ్రోజుల రెసిడెన్షియల్ శిక్షణ కార్యక్రమాన్ని ఆయన ప్రారంభించి మాట్లాడారు. ‘ప్రొఫెసర్ జయశంకర్ బడిబాట’ కార్యక్రమంలో భాగంగా డీఈఓలు ప్రభుత్వ బడుల్లో ప్రవేశాలు పెరిగేలా చూడాలని సూచించారు.
