- స్పీకర్ కు ఫిర్యాదు చేసిన విప్
హైదరాబాద్, వెలుగు: ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే బీర్ల ఐలయ్యకు మేడ్చల్–మల్కాజిగిరి జిల్లా అల్వాల్లో చేదు అనుభవం ఎదురైంది. విప్ ఐలయ్య, ఆయన గన్మెన్ కథనం ప్రకారం.. ఈ నెల 22న అల్వాల్లో ఓ వివాహానికి హాజరై తిరిగి వస్తుండగా ట్రాఫిక్ పోలీసులు ఆయన వాహనాన్ని తనిఖీల కోసం ఆపారు. వీఐపీ సైరన్లు, ఎమ్మెల్యే స్టిక్కర్ల దుర్వినియోగాన్ని అరికట్టేందుకు నిర్వహిస్తున్న ప్రత్యేక డ్రైవ్లో భాగంగా ఈ తనిఖీలు చేపట్టారు. కారు ఆపిన వెంటనే గన్మెన్ దిగి.. అందులో ప్రభుత్వ విప్ బీర్ల ఐలయ్య ఉన్నారని ట్రాఫిక్ ఎస్ఐ కిషోర్కుమార్కు తెలిపినా ఆయన పట్టించుకోకుండా దురుసుగా ప్రవర్తించినట్లు తెలిపారు.
తాను ఎమ్మెల్యేనని చెప్పినప్పటికీ కనీస మర్యాద చూపలేదని, ‘ఎవరు పడితే వాళ్లు ఎమ్మెల్యేలమంటున్నారు.. ఎమ్మెల్యే స్టిక్కర్లు పెట్టుకోవడం ఫ్యాషన్ అయింది’ అంటూ ఎస్ఐ అన్నట్టు స్పీకర్ గడ్డం ప్రసాద్కు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నారు. ఈ ఘటనను స్పీకర్ సీరియస్గా తీసుకుని వివరణ ఇవ్వాలని మల్కాజిగిరి పోలీసు కమిషనర్ సుమతిని ఆదేశించారు. దీంతో ట్రాఫిక్ డీసీపీ రాహుల్ రెడ్డి, ఎస్ఐ కిషోర్కుమార్ గురువారం స్పీకర్ ఎదుట హాజరై, ప్రత్యేక తనిఖీల్లో భాగంగానే వాహనాన్ని ఆపినట్లు వివరణ ఇచ్చారు.
