క్రెడిట్ ఆధారిత డిటెన్షన్ విధానం సడలించిన జేఎన్టీయూ

క్రెడిట్ ఆధారిత డిటెన్షన్ విధానం సడలించిన జేఎన్టీయూ

హైదరాబాద్ : క్రెడిట్ ఆధారిత డిటెన్షన్ సడలించినందుకు జేఎన్టీయూ అధికారులకు గవర్నర్ తమిళి సై సౌందర రాజన్ అభినందనలు తెలిపారు. అక్టోబర్ 15వ తేదీన భారత మాజీ రాష్ట్రపతి అబ్దుల్ కలాం జయంతి సందర్భంగా ట్విట్టర్ స్పేస్ ద్వారా విద్యార్థులు... యువతతో గవర్నర్ సంభాషించారు. ఈ సందర్భంగా JNTU విద్యార్థులు క్రెడిట్ ఆధారిత డిటెన్షన్ విధానం వల్ల తమకు జరుగుతున్న నష్టాన్ని గవర్నర్ కు వివరించారు. సమస్యను పరిష్కరిస్తామని విద్యార్థులకు గవర్నర్ హామీ ఇచ్చారు. గవర్నర్ విజ్ఞప్తి మేరకు క్రెడిట్ ఆధారిత డిటెన్షన్ విధానాన్ని సడలిస్తున్నట్టు  JNTU అధికారులు ఉత్తర్వులు జారీ చేశారు. ఈ సందర్భంగా గవర్నర్ తమిళి సై అధికారులకు అభినందనలు తెలిపారు.

ఏంటీ క్రెడిట్ ఆధారిత డిటెన్షన్ విధానం..? 
జేఎన్‌టీయూ పరిధిలోని కళాశాలల్లో ఇంజినీరింగ్‌లో చేరిన విద్యార్థులు ప్రతిఏటా నిర్దేశిత క్రెడిట్స్ సాధించాల్సి ఉంటుంది. అలాగే 75 శాతం  హాజరు ఉంటేనే సెమిస్టర్ పరీక్షలు రాసేందుకు అనుమతిస్తారు. కరోనాతో రెండేళ్లు హాజరుతో పాటు క్రెడిట్ ఆధారిత డిటెన్షన్ విధానాన్ని యూనివర్సిటీ రద్దు చేసింది. ప్రస్తుతం సాధారణ పరిస్థితులు నెలకొన్న నేపథ్యంలో ఆ విధానాన్ని పునరుద్ధరిస్తున్నట్లు ప్రకటించింది. ఈ విధానం ప్రకారం ఇంజినీరింగ్ విద్యార్థులు మొదటి ఏడాది నుంచి రెండో ఏడాదిలోకి వెళ్లాలంటే 18 క్రెడిట్స్, రెండో ఏడాది నుంచి మూడో ఏడాదిలోకి వెళ్లాలంటే 47 క్రెడిట్స్, 3 నుంచి నాలుగో ఏడాదిలోకి వెళ్లాలంటే 73 క్రెడిట్స్ సాధించాల్సి ఉంటుంది. ఇక లేటరల్ ఎంట్రీ ద్వారా ప్రవేశాలు పొందిన విద్యా్ర్థులు రెండో ఏడాది నుంచి మూడో ఏడాదిలోకి వెళ్లాలంటే 25 క్రెడిట్స్, 3 నుంచి నాలుగో ఏడాదిలోకి వెళ్లాలంటే 51 క్రెడిట్స్ ఉండాలి. ఒకవేళ విద్యార్థులు నిర్దేశిత క్రెడిట్స్ సాధించలేకపోతే మరుసటి ఏడాదిలోకి ప్రవేశించే వీలుండదు.