రాజన్న సిరిసిల్ల: రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డి పేట మండలం అక్కపెల్లి శివార్లలో SBI ఏటీఎం మిషన్ దొరికింది. ఎల్లారెడ్డిపేట మండల కేంద్రంలో అర్ధరాత్రి ఏటీఎం చోరీకి గురైన సంగతి తెలిసిందే. నిందితులు మిషన్లోని నగదుతో కూడిన లాకర్ను మాయం చేసి, మిగిలిన మిషన్ బాడీని అక్కపెల్లి గ్రామ శివార్లలోని బుగ్గరాజేశ్వరస్వామి ఆలయానికి వెళ్లే రహదారి పక్కన పడేసి వెళ్లిపోయారు.
రాజన్న సిరిసిల్ల జిల్లా ఎస్పీ మహేష్ బి గీతే స్పాట్ను పరిశీలించారు. క్లూస్ టీం సహాయంతో వేలిముద్రలు, ఇతర ఆధారాలను పోలీసులు సేకరించారు. నిందితుల కోసం ప్రత్యేక బృందాలతో గాలింపు చర్యలు చేపట్టారు. ఇక్కడ మరో విషయం ఏంటంటే.. దొంగలు ఏటీఎం మిషన్ను మాయం చేసిన ఈ ఏటీఎం సెంటర్ పోలీస్ స్టేషన్కు కూతవేటు దూరంలోనే ఉంది.
పోలీసులకు తెలిసిపోతుందనే భయం ఏమాత్రం లేకుండా.. ఏటీఎం మిషన్ను మాయం చేసిన ఘటన స్థానికంగా తీవ్ర చర్చనీయాంశం అయింది. ఎందుకంటే.. ఒక ఏటీఎం సెంటర్లో ఉన్న మిషన్ను చోరీ చేయడం అంత సులువైన విషయం కాదు. గ్యాస్ కట్టర్లు వాడితే గానీ పని కాదు. ఏటీఎం డబ్బా బరువు కూడా ఉంటుంది.
ALSO READ : దక్షిణాదిపై కేంద్రం కుట్రను తిప్పి కొట్టాలి
అలాంటిది.. అంత ధైర్యంగా దొంగలు ఏటీఎం మిషన్ను దొంగిలించి.. వెహికల్లోకి ఎక్కించి తీసుకెళ్లడం గమనార్హం. చోరీ సమాచారం అందుకున్న వెంటనే జిల్లా ఎస్పీ మహేష్ బి గీతే, డీఎస్పీ నాగేంద్ర చారి సంఘటనా స్థలానికి చేరుకున్నారు. డాగ్ స్క్వాడ్ , సీసీటీవీ కెమెరాల ఫుటేజ్ను క్షుణ్ణంగా పరిశీలించిన అధికారులు నిందితుల కోసం ముమ్మరంగా గాలిస్తున్నారు.
