ప్రకృతి వనం కోసం దివ్యాంగుడి భూమి లాక్కున్నారు

ప్రకృతి వనం కోసం దివ్యాంగుడి భూమి లాక్కున్నారు

జైపూర్, వెలుగు: గత 50 ఏండ్లుగా ఈ భూమిని సాగు చేసుకుంటున్నం సార్.. మా భూమిని లాక్కోకుండ్రి మీకు పుణ్యముంటది.. అని మంచిర్యాల జిల్లా జైపూర్ మండలంలోని శివ్వారం గ్రామానికి చెందిన దివ్యాంగ రైతు తాళప్లల్లి శంకరయ్య ఆఫీసరను వేడుకున్నారు. శివ్వారం గ్రామ శివారులోని సర్వే నంబరు 17లోని తన 8 గుంటల భూమిని అధికారులు ప్రకృతి వనం కోసమంటూ లాక్కోవడంతో జీవనోపాధి కోల్పోయానని, తమకు అన్యాయం చేయద్దంటూ శుక్రవారం కుటుంబసభ్యులతో కలిసి తహసీల్దార్ ఆఫీస్ ముందు నిరసన తెలిపారు. బాధిత కుటుంబీకులకు బీజేపీ నాయకులు మద్దతు తెలిపారు. శ్మశానవాటికలు, ప్రకృతి వనాల పేరిట భూములు లాక్కోవడం దారుణమని బీజేపీ మండల అధ్యక్షుడు చల్ల విశ్వం భర్ రెడ్డి అన్నారు. బడుగు బలహీనవర్గాల కోసం బీజేపీ పోరాడుతుందన్నారు.