
గ్రూప్ ఆఫ్ 7 అనేది ప్రపంచంలోని ఏడు అతి పెద్ద, అత్యంత అభివృద్ధి చెందిన ఆర్థిక వ్యవస్థలు కలిగిన దేశాల కూటమి. అంతర్జాతీయ ఆర్థిక విధానాలు, భద్రత, వాతావరణ మార్పులు, ఇతర ప్రపంచ సమస్యలపై చర్చించి, సమన్వయం చేసుకోవడానికి ఈ దేశాలు వార్షికంగా సమావేశం అవుతాయి. జి–7 కూటమిలో కెనడా, ఫ్రాన్స్, జర్మనీ, ఇటలీ, జపాన్, యునైటెడ్ కింగ్ డమ్(యూకే), యూఎస్ఏ సభ్య దేశాలుగా ఉన్నాయి. ఈ సమావేశాలకు యూరోపియన్ యూనియన్ కూడా హాజరవుతుంది. అయితే, జి–7లో సభ్య దేశం కాదు.
1970లో ప్రపంచ ఆర్థిక సంక్షోభం, యోమ్ కిప్సర్ యుద్ధం తర్వాత తలెత్తిన చమురు సంక్షోభం నేపథ్యంలో ప్రధాన పారిశ్రామిక దేశాల నాయకులు ఆర్థిక సమస్యలను చర్చించడానికి, పరిష్కరించడానికి ఒక వేదిక అవసరాన్ని గుర్తించారు. దీని ఫలితంగా 1975లో ఫ్రాన్స్లోని రాంబౌలెట్లో మొదటి శిఖరాగ్ర సమావేశం జరిగింది. ప్రారంభంలో జి–6గా, 1976లో జి–7గా, 1998లో జి–8గా మారినా, 2014లో క్రిమియాను స్వాధీనం చేసుకున్న తర్వాత రష్యాను తొలగించడంతో తిరిగి జి–7గా కొనసాగుతున్నది.
లైబ్రరీ గ్రూప్–1973
జి–7కు పూర్వగామి లైబ్రరీ గ్రూప్. ఈ బృందం అప్పటి అమెరికా ట్రెజరీ సెక్రటరీ జార్టజ్ షుల్ట్జ్ చొరవతో ఏర్పడింది. ఆయన ఫ్రాన్స్, పశ్చిమ జర్మనీ, జపాన్, యూకే ఆర్థిక మంత్రులను ఒక అనధికారిక సమావేశానికి వాషింగ్టన్ డి.సి.లోని వైట్ హౌస్ లైబ్రరీలో ఆహ్వానించారు. ఇది ప్రపంచ ఆర్థిక సమస్యలపై గోప్యంగా, స్వేచ్ఛగా చర్చించడానికి ఒక వేదికను అందించింది. ఈ సమావేశానికి ఫ్రాన్స్, పశ్చిమ జర్మనీ, ఇటలీ, జపాన్, యూకే, యూఎస్ఏ దేశాల అధినేతలు హాజరయ్యారు. దీంతో ఇది జి–6గా ఏర్పడింది. ఈ సమావేశం ప్రధాన లక్ష్యం ప్రపంచ ఆర్థిక సంక్షోభానికి నివారణకు సాధ్యమయ్యే పరిష్కారాలపై చర్చించడం.
జి–7గా మారడం– 1976
1976లో ప్యూర్టోరికోలోని డోరాడోలో జరిగిన సమావేశంలో కెనడా కూడా జి–6లో చేరింది. దీంతో ఈ కూటమి జి–7గా మారింది. అప్పటి నుంచి ఏడు దేశాలతో జి–7గా కొనసాగింది.
జి–8గా విస్తరణ–1997
1997లో రష్యాను కూడా కూటమిలో చేర్చుకోవడానికి నిర్ణయం తీసుకున్నారు. 1998లో రష్యా పూర్తి సభ్యదేశంగా మారడంతో జి–8గా విస్తరించింది. సోవియట్ యూనియన్ పతనం తర్వాత తూర్పు– పశ్చిమ దేశాల మధ్య సహకారాన్ని పెంపొందించడం దీని వెనుక ఉన్న ఆలోచన.
తిరిగి జి–7గా మారడం– 2014
2014లో రష్యా క్రిమియాను ఆక్రమించుకోవడం, ఉక్రెయిన్లో ఉద్రిక్తతలకు కారణం కావడంతో జి–7 సభ్య దేశాలు రష్యా సభ్యత్వాన్ని రద్దు చేసి దానికి ఉద్వాసన పలికాయి. అప్పటినుంచి ఈ కూటమి తిరిగి జి–7గానే కొనసాగుతున్నది.
జి–7 శిఖరాగ్ర సదస్సు– 2025
ఈ సదస్సు 2025, జూన్ 15–17న కెనడాలోని కననాస్కిస్ లో జరగనున్నది. 2002 తర్వాత కననాస్కిస్లో జి–7 సదస్సు జరగడం రెండోసారి. 2025, జనవరి 1 నుంచి కెనడా జి–7 అధ్యక్ష పదవిని స్వీకరించింది. ప్రపంచ శాంతి, భద్రత, ఆర్థిక స్థిరత్వం, వృద్ధి, డిజిటల్ పరివర్తన వంటి ప్రపంచ సవాళ్లకు, అవకాశాలకు భాగస్వామ్య పరిష్కారాలను కనుగొనడానికి కలిసి పనిచేయడం దీని ముఖ్య ఉద్దేశం. కెనడా తన నాయకత్వాన్ని ప్రదర్శించడానికి అర్థవంతమైన చర్చలు, సమష్టి చర్యలు, వినూత్న పరిష్కారాలను ప్రోత్సహించడానికి ఈ సంవత్సరం ఒక అవకాశాన్ని అందిస్తున్నది.
శిఖరాగ్ర సదస్సు– 2024
ఈ సదస్సు 2024, జూన్ 13–15న ఇటలీలోని అపులియా, ఎగ్నాజియా జరిగింది. ఇప్పటివరకు ఇటలీలో ఏడుసార్లు జి–7 సదస్సులు నిర్వహించారు.
భారతదేశం పాత్ర
జి–7లో భారత్ సభ్య దేశం కాదు. కానీ ఇండియా ఆర్థిక, భౌగోళిక, రాజకీయ ప్రాముఖ్యతను గుర్తించి ఆతిథ్య దేశం(ఇటలీ) ఆహ్వానం మేరకు ప్రధాని నరేంద్ర మోదీ 2024 జి–7 సదస్సులో పాల్గొన్నారు. ప్రధాని మోదీకి ఇది వరుసగా ఐదో జి–7 సదస్సు భాగస్వామ్యం.
- భారతదేశం గ్లోబల్ సౌత్ (ప్రపంచ దక్షిణాది దేశాలు) ప్రాతినిధ్యం, సమగ్ర, సుస్థిర ప్రపంచ పాలనకు కట్టుబడి ఉన్నది.
- ఈ సదస్సు భారతదేశానికి వాతావరణ మార్పులు, సాంకేతిక ఆవిష్కరణలు వంటి ప్రపంచ సమస్యలపైన తన వైఖరిని తెలియజేయడానికి వేదికగా నిలిచింది.
- ఇండియా– మిడిల్ ఈస్ట్ –యూరోపియన్ కారిడార్(ఐఎంఈసీ) వంటి ప్రాజెక్టులకు జి–7 దేశాల నుంచి మద్దతు లభించింది.