- మేనెల జీఎస్టీ వసూళ్లు రూ.1.94 లక్షల కోట్లు
న్యూఢిల్లీ: వస్తు సేవలు, దిగుమతుల సరఫరా పెరగడంతో గత నెల జీఎస్టీ వసూళ్ల విలువ 3.2 శాతం వృద్ధి చెంది రూ.1.94 లక్షల కోట్లు దాటింది. గత ఏడాది మేలో ఈ వసూళ్లు 1.88 లక్షల కోట్లుగా నమోదయ్యాయి. దేశీయ లావాదేవీల ద్వారా స్థూల జీఎస్టీ వసూళ్లు 37,397 కోట్లు , రాష్ట్ర జీఎస్టీ వసూళ్లు రూ.45,143 కోట్లు , ఇంటిగ్రేటెడ్ జీఎస్టీ వసూళ్లు విలువ రూ.51,990 కోట్లుగా ఉంది. వస్తువుల, పన్ను సరఫరా 26.9 శాతం, సేవల రంగం 22.2 శాతం వృద్ధి సాధించింది.
దిగుమతుల ద్వారా ఐజీఎస్టీ వసూళ్లు 19.1 శాతం పెరిగి రూ.59,654 కోట్లకు చేరాయి. రీఫండ్లను సర్దుబాటు చేసిన తర్వాత నికర జీఎస్టీ ఆదాయం 3.3 శాతం పెరిగి 1.67 లక్షల కోట్లుగా నమోదైంది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మొదటి రెండు నెలల్లో స్థూల వసూళ్లు రూ.4.37 లక్షల కోట్లకు చేరాయి.
