గుజరాత్ లో భారీ అగ్నిప్రమాదం: కిటికీలు పగలగొట్టి వృద్ధులు, పిల్లలను కాపాడిన సిబ్బంది..

గుజరాత్ లో భారీ అగ్నిప్రమాదం: కిటికీలు పగలగొట్టి  వృద్ధులు, పిల్లలను కాపాడిన  సిబ్బంది..

గుజరాత్‌లోని భావ్‌నగర్‌లోని కలుభా రోడ్డులోని ఒక కాంప్లెక్స్‌లో బుధవారం ఉదయం భారీ అగ్నిప్రమాదం సంభవించింది. ఈ కాంప్లెక్స్‌లో చాల  ప్రైవేట్ హాస్పిటళ్లు, పాథాలజీ ల్యాబ్‌లు, షాపులు, ఆఫీసులు ఉన్నాయి. మంటలు చెలరేగిన వెంటనే కాంప్లెక్స్‌లో ఒక్కసారిగా భయాందోళనలు నెలకొన్నాయి. సమాచారం ప్రకారం, కాంప్లెక్స్‌లోని పాథాలజీ ల్యాబ్‌లో మంటలు చెలరేగిన  త్వరగా చుట్టుపక్కలకు వ్యాపించాయి.

పొగ వ్యాపించడంతో కాంప్లెక్స్‌లోని హాస్పిటల్లో  చేరిన రోగులు ఊపిరి ఆడక ఇబ్బంది పడ్డారు. చాలా మంది రోగులు, పిల్లలు,  వృద్ధులు పొగలో చిక్కుకుపోయారు. సంఘటన గురించి సమాచారం అందిన వెంటనే  మంటల ఆర్పేందుకు 10 ఫైరింజన్లు, 50 మందికి పైగా అగ్నిమాపక సిబ్బంది అక్కడికి చేరుకొని సహాయ, రక్షణ చర్యలు  చేపట్టాయి. 

అగ్నిమాపక సిబ్బంది  ప్రకారం, ఇప్పటివరకు 19 నుండి 20 మందిని సురక్షితంగా బయటకి తరలించారు. నైస్ చిల్డ్రన్స్ హాస్పిటల్ సహా  ఇతర ఆసుపత్రులలో రెస్క్యూ బృందాలు కిటికీలను పగలగొట్టి, రోగులను మెట్ల ద్వారా బయటికి తీసుకొచ్చారు. చాలా మంది పిల్లలను స్ట్రెచర్లపై సురక్షితంగా కాపాడారు. 

పొగలో చిక్కుకున్న రోగులు, పిల్లలు, వృద్ధులను బయటకు తీసుకురావడానికి స్థానికులు కూడా అగ్నిమాపక శాఖకు సహాయం చేశారు. మంటలు చెలరేగిన వెంటనే, ఆ ప్రాంతం ఒక్కసారిగా ఉలిక్కిపడింది, ప్రజలు పరుగులు తీయడం ప్రారంభించారు. వైద్య సిబ్బంది వెంటనే రోగులను ఇతర ఆసుపత్రులకు తరలించడం ప్రారంభించారు.

మంటలు చాలా వరకు అదుపులోకి వచ్చాయని, చర్యలు కొనసాగుతున్నాయని అగ్నిమాపక సిబ్బంది తెలిపింది. మంటలకు గల   కారణాల పై ప్రస్తుతం దర్యాప్తు చేస్తున్నారు. అలాగే ప్రజలను భవనం నుండి దూరంగా ఉండాలని కోరారు.

అయితే షార్ట్ సర్క్యూట్ వల్లే ఈ ప్రమాదం జరిగి ఉండవచ్చని కొందరు అనుమానిస్తున్నారు.  ఈ సంఘటనలో ఎవరికీ గాయాలు కాలేదు. అగ్నిమాపక సిబ్బంది సకాలంలో సంఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు ప్రారంభించింది.