న్యూఢిల్లీ: భారీ టార్గెట్ ఛేజింగ్లో చివరి వరకు అద్భుతంగా ఆడిన ఢిల్లీ క్యాపిటల్స్ చివరి రెండు బాల్స్లో బోల్తా కొట్టింది. రెండు బాల్స్కు రెండు రన్స్ అవసరమైన దశలో హార్డ్ హిట్టర్ డేవిడ్ మిల్లర్ (20 బాల్స్లో 3 ఫోర్లు, 3 సిక్స్లతో 41 నాటౌట్)ను ప్రసిధ్ కృష్ణ (2/52) సూపర్బ్గా కట్టడి చేశాడు. ఫలితంగా గుజరాత్ ఒక్క రన్స్ తేడాతో ఢిల్లీపై గెలిచి ఐపీఎల్–19లో బోణీ చేసింది. టాస్ ఓడిన గుజరాత్ 20 ఓవర్లలో 210/4 స్కోరు చేసింది.
కెప్టెన్ శుభ్మన్ గిల్ (45 బాల్స్లో 4 ఫోర్లు, 5 సిక్స్లతో 70), జోస్ బట్లర్ (27 బాల్స్లో 3 ఫోర్లు, 5 సిక్స్లతో 52), వాషింగ్టన్ సుందర్ (32 బాల్స్లో 6 ఫోర్లు, 2 సిక్స్లతో 55) దంచికొట్టారు. తర్వాత ఢిల్లీ 20 ఓవర్లలో 209/8 స్కోరుకే పరిమితమైంది. కేఎల్ రాహుల్ (52 బాల్స్లో 11 ఫోర్లు, 4 సిక్స్లతో 92) ఒంటరి పోరాటం వృథా అయ్యింది. రషీద్కు ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ అవార్డు లభించింది.
బట్లర్ దంచెన్
ఫ్లాట్ పిచ్పై బ్యాటింగ్కు దిగిన గుజరాత్కు టాప్ ఆర్డర్ భారీ స్కోరు అందించింది. రెండు ఫోర్లతో ఖాతా తెరిచిన సాయి సుదర్శన్ (12) మూడో ఓవర్లోనే వెనుదిరిగినా.. గిల్, బట్లర్ ఢిల్లీ బౌలర్లను ఉతికేశారు. భారీ సిక్స్తో ఇన్నింగ్స్ మొదలుపెట్టిన బట్లర్ 4, 6తో టచ్లోకి వచ్చాడు. ముకేశ్ కుమార్ (2/55) వేసిన ఐదో ఓవర్లో 6, 6, 4, 6తో 23 రన్స్ దంచాడు. ఆరో ఓవర్లో మరో ఫోర్ కొట్టి 68/1 స్కోరుతో పవర్ప్లేను ముగించాడు. రెండో ఎండ్లో గిల్ వీలైనప్పుడల్లా బౌండ్రీలతో స్ట్రయిక్ రొటేట్ చేశాడు.
అయితే 24 బాల్స్లోనే ఫిఫ్టీ పూర్తి చేసిన బట్లర్ను 8వ ఓవర్లో కుల్దీప్ యాదవ్ (1/42) బోల్తా కొట్టించాడు. దాంతో రెండో వికెట్కు 60 రన్స్ పార్ట్నర్షిప్ ముగిసింది. గిల్తో జోడీ కట్టిన సుందర్ ఇన్నింగ్స్లో ఊపు తెచ్చాడు. ఈ ఇద్దరు 4, 6 బాదడంతో ఫస్ట్ టెన్లో జీటీ 101/2 స్కోరు చేసింది. 11వ ఓవర్లో ఫోర్ కొట్టిన సుందర్ తర్వాతి ఓవర్లో 4, 4, 6 దంచగా, గిల్ 6తో 23 రన్స్ వచ్చాయి.
వీరిద్దరు పోటీపడి సింగిల్స్, డబుల్స్ తీశారు. ఈ క్రమంలో గిల్ ఫోర్తో 33 బాల్స్లో హాఫ్ సెంచరీ చేశాడు. దాంతో 15 ఓవర్లలో స్కోరు 161/2కు పెరిగింది. ఇక్కడి నుంచి మరింత వేగం పెంచిన గిల్ ఫోర్, సిక్స్లతో విరుచుకుపడగా, సుందర్ స్ట్రయిక్ రొటేట్ చేశాడు. అయితే 18వ ఓవర్లో ఎంగిడి (1/24) స్లో డెలివరీని భారీ షాట్ కొట్టబోయిన గిల్.. నితీశ్ రాణాకు క్యాచ్ ఇచ్చాడు. మూడో వికెట్కు 104 రన్స్ జతయ్యాయి. 30 బాల్స్లో ఫిఫ్టీ కొట్టిన సుందర్, గ్లెన్ ఫిలిప్స్ (14 నాటౌట్) భారీ షాట్లకు తెరలేపారు. చివరి రెండు ఓవర్లలో 25 రన్స్ రాబట్టడంతో జీటీ మంచి టార్గెట్ను నిర్దేశించింది.
రాహుల్ నిలకడ.. మిల్లర్ మెరుపులు
భారీ ఛేజింగ్లో ఢిల్లీకి ఓపెనర్లు పాథుమ్ నిశాంక (41), రాహుల్ అదిరిపోయే ఆరంభాన్నిచ్చారు. తొలి ఓవర్లోనే నిశాంక మూడు ఫోర్లతో ఛేదన మొదలుపెట్టగా, రాహుల్ రెండు బౌండ్రీలు, ఓ సిక్స్తో లైన్లోకి వచ్చాడు. ఐదో ఓవర్లో రషీద్ ఖాన్ (3/17) ఐదు రన్స్తో కట్టడి చేసినా.. ఆరో ఓవర్లో ఆశోక్ శర్మ 4, 4, 6, 4, 4తో 23 రన్స్ ఇచ్చుకున్నాడు. ఫలితంగా పవర్ప్లేలో ఢిల్లీ 63/0 స్కోరుతో పటిష్ట స్థితిలో నిలిచింది.
తర్వాతి రెండు ఓవర్లలో 13 రన్స్ రాగా.. 9వ ఓవర్లో ఢిల్లీకి తొలి దెబ్బ తగిలింది. ప్రసిధ్ కృష్ణ.. నిశాంకను ఔట్ చేసి తొలి వికెట్కు 76 రన్స్ పార్ట్నర్షిప్ను బ్రేక్ చేశాడు. ఇదే ఓవర్లో రాహుల్ 4, 6, 6, 4తో 21 రన్స్ పిండుకున్నాడు. ఈ క్రమంలో 29 బాల్స్లో ఫిఫ్టీ కొట్టాడు. కానీ 10వ ఓవర్లో రషీద్ డబుల్ స్ట్రోక్ ఇచ్చాడు. వరుస బాల్స్లో నితీశ్ రాణా (5), ఇంపాక్ట్ ప్లేయర్ సమీర్ రిజ్వీ (0)ను పెవిలియన్కు పంపాడు.
రెండో వికెట్కు 25 రన్స్ పార్ట్నర్షిప్ ముగియగా, ఢిల్లీ 101/3తో తొలి పది ఓవర్లను ముగించింది. ఓవైపు రాహుల్ జోరు కొనసాగించినా.. రెండో ఎండ్లో మిగతా బ్యాటర్లు ఫెయిలయ్యారు. డేవిడ్ మిల్లర్ రిటైర్డ్ హర్ట్ కాగా, 14వ ఓవర్లో అక్షర్ పటేల్ (2) రషీద్కు వికెట్ ఇచ్చాడు. 15 ఓవర్లలో ఢిల్లీ స్కోరు 142/4గా మారింది. ఇక చివరి ఐదు ఓవర్లలో 69 రన్స్ కావాల్సిన దశలో రాహుల్ ఒంటరి పోరాటం చేసినా.. 17వ ఓవర్లో స్టబ్స్ (7) రనౌటయ్యాడు.
ఫోర్ కొట్టి చివరి బాల్కు రాహుల్ వెనుదిరిగడంతో ఢిల్లీ 166/6తో ఎదురీత మొదలుపెట్టింది. మళ్లీ క్రీజులోకి వచ్చిన మిల్లర్ 4, 6, 4, 6, తో మెరుపులు మెరిపించగా, విప్రాజ్ నిగమ్ (12) కూడా బ్యాట్ ఝుళిపించాడు. చివరి ఓవర్లో 13 రన్స్ అవసరం కాగా మిల్లర్ సిక్స్ రాబట్టగా, నిగమ్ 4 కొట్టి ఔటయ్యాడు. చివరి రెండు బాల్కు రెండు రన్స్ అవసమైన దశలో మిల్లర్ సింగిల్ తీసే చాన్స్ వృథా చేయగా, ఆఖరి బాల్కు కుల్దీప్ యాదవ్ (1) రనౌటయ్యాడు.
సంక్షిప్త స్కోర్లు
గుజరాత్: 20 ఓవర్లలో 210/4 ( గిల్ 70, సుందర్ 55, బట్లర్ 52, ముకేశ్ 2/55). ఢిల్లీ: 20 ఓవర్లలో 209/8 (రాహుల్ 92, మిల్లర్ 41*, రషీద్ 3/17).
