- నలుగురు సప్లయర్స్, ముగ్గురు కస్టమర్లు అరెస్ట్
- 66 బాటిల్స్ స్వాధీనం
హైదరాబాద్, వెలుగు: గంజాయిని హాష్ ఆయిల్ గా మార్చి సప్లయ్ చేస్తున్న వ్యక్తితో పాటు ముగ్గురు కస్టమర్లను వెస్ట్జోన్ టాస్క్ఫోర్స్ పోలీసులు బుధవారం అరెస్ట్ చేశారు. రూ.లక్షా 90 వేల విలువైన 66 హాష్ ఆయిల్ బాటిల్స్ ను స్వాధీనం చేసుకున్నారు. ఏపీలోని ప్రకాశం జిల్లా అయ్యంబొట్లపల్లికి చెందిన ఎం.అశోక్కుమార్(22), గుంటూరు జిల్లా గుజ్జనగుండ్లకు చెందిన స్టూడెంట్ కొరివి శరత్(21) ఇద్దరూ ఎస్ఆర్నగర్ పరిధి బీకే గూడలో ఉంటున్నారు. అశోక్, శరత్ తో పాటు మాదాపూర్కి చెందిన వీరి ఫ్రెండ్ హరి(24) స్మోకింగ్,గంజాయికి అలవాటుపడ్డారు. విశాఖ ఏజెన్సీ పాడేరు నుంచి హాష్ ఆయిల్ కొని సిటీలో అమ్మేందుకు ఈ ముగ్గురు స్కెచ్ వేశారు. పాడేరులోని డ్రగ్ సప్లయర్ చిరు దగ్గర హాష్ ఆయిల్ కొన్నారు. భద్రాద్రి కొత్తగూడెంకు చెందిన వై. సుమన్ వీర్(22), సీహెచ్. భార్గవ్(22), మాసబ్ ట్యాంక్కి చెందిన మహ్మద్ ఇసాక్ అలీ(22)తో కలిసి హాష్ ఆయిల్ దందా మొదలుపెట్టారు. పి. సాయినవీన్, బి. అశోక్, మీజన్ అహ్మద్ రావ్ జీలను రెగ్యులర్ గా అశోక్ గ్యాంగ్ దగ్గర హాష్ ఆయిల్ ను కొనేవారు. దీని గురించి సమాచారం అందుకున్న వెస్ట్జోన్ టాస్క్ఫోర్స్ పోలీసులు బుధవారం ఉదయం బీకె గూడలో దాడులు చేశారు. అశోక్ కుమార్, సుమన్ వీర్, భార్గవ్, ఇసాక్ అలీతో పాటు కస్టమర్లు సాయి నవీన్, అశోక్, అహ్మద్ రావ్జీలను అరెస్ట్ చేశారు.
కొకైన్ సప్లయర్స్ ఇద్దరు అరెస్ట్
జీడిమెట్ల: కొకైన్అమ్ముతున్న ఇద్దరిని పేట్ బషీరాబాద్ పోలీసులు అరెస్ట్ చేశారు. గోవాకి చెందిన వలవెలకర్ రోహిత్(31), జూబ్లీహిల్స్ కి చెందిన క్రిష్ణ మౌర్య(24) ఇద్దరూ ఫ్రెండ్స్. రోహిత్ గోవా నుంచి కొకైన్ తీసుకొచ్చి క్రిష్ణ మౌర్య సాయంతో మంగళవారం సాయంత్రం సుచిత్ర చౌరస్తాలో అమ్మేందుకు సిద్ధమయ్యాడు. పేట్బషీరాబాద్ పోలీసులు దాడి చేసి వారిద్దరిని అరెస్టు చేశారు. 13 గ్రాముల కొకైన్ స్వాధీనం చేసుకున్నారు. బుధవారం వీరిని జ్యుడీషియల్ కస్టడికీ తరలించారు.