నా బాబును కాపాడండి..ప్రజావాణిని ఆశ్రయించిన తల్లి

నా బాబును కాపాడండి..ప్రజావాణిని ఆశ్రయించిన తల్లి
  • నాలుగు నెలల చిన్నారికి గుండెలో రంధ్రం
  • స్పందించిన నోడల్ ఆఫీసర్..స్టార్ హాస్పిటల్​కు రెఫర్

పంజాగుట్ట, వెలుగు : పుట్టుకతోనే తన బాబు గుండెలో రంధ్రం  ఉందని, వైద్యం చేయించేందుకు డబ్బుల్లేవంటూ మంగళవారం నిర్వహించిన ప్రజావాణిని ఓ తల్లి ఆశ్రయించింది. ఆపరేషన్ చేయించేందుకు పది లక్షల వరకు అవసరమని, ఆ స్థోమత తనకు లేదంటూ నోడల్ అధికారి దివ్య ముందు ఆమె కన్నీళ్లు పెట్టుకుంది. తన బాబును కాపాడాలని వేడుకుంది. జియాగూడకు చెందిన సునీతకు 4 నెలల కిందట బాబు జన్మించాడు. పుట్టుకతోనే గుండె​లో రంధ్రం ఉందని, ఆపరేషన్ చేయాలని డాక్టర్లు సూచించారు.

ప్రైవేట్ ఆస్పత్రిలో సర్జరీ చేయించాలంటే రూ.10 లక్షల వరకు ఖర్చు అవుతుందని నోడల్ అధికారికి సునీత వివరించింది. పేదరికంలో ఉన్న తన వద్ద అన్ని డబ్బుల్లేవని చెప్పింది. ప్రభుత్వం తరఫున ఆపరేషన్ చేయించాల్సిందిగా సీఎం రేవంత్ రెడ్డిని కోరేందుకే ప్రజావాణికి వచ్చినట్టు ఆమె వివరించింది. మెడికల్ రిపోర్టులు పరిశీలించిన నోడల్ అధికారి దివ్య వెంటనే స్పందించారు.

ఆరోగ్యశ్రీ కింద చికిత్స చేయించాలని అధికారులను ఆదేశించారు. అక్కడే ఉన్న అంబులెన్స్​లో బంజారాహిల్స్​లోని స్టార్ హాస్పిటల్​కు పంపించారు. దీంతో 4 నెలల బాబుకు గుండె ఆపరేషన్ చేసేందుకు డాక్టర్లు సిద్ధం అవుతున్నారు.