గుండెల్ని బరువెక్కించిన 'సైరాట్'

గుండెల్ని బరువెక్కించిన 'సైరాట్'

గౌరవం.. ఎందులో ఉంటుంది? మతంలోనా.. కులంలోనా? వృత్తిలోనా.. ప్రవృత్తిలోనా? ఆస్తిలోనా.. అంతస్తులోనా? వేరే మతం వారినో కులం వారినో ప్రేమిస్తే పోయే గౌరవమూ ఓ గౌరవమేనా? అంతస్తు అంతరాల్ని సాకుగా చూపించి కన్నపేగును కసి తీరా కోసేసుకుంటే గౌరవం నిలబడుతుందా? అడుగడుగునా ఆంక్షలు విధించి.. అభిమానాల్ని అన్యాయంగా అణిచేయడమేనా గౌరవం? అవమాన భారంతో రగిలిపోతూ.. అనుబంధాల్ని అంతమొందించడమేనా గౌరవం? ఇప్పుడు కాదు.. నిన్న కాదు.. మొన్న కాదు.. ఎన్నో దశాబ్దాలుగా వినబడుతున్న ప్రశ్నలివి. వీటికి ఇంతవరకు జవాబులు దొరకలేదు. దొరికి ఉంటే.. ‘సైరాట్’ సినిమా వచ్చేదే కాదు. 

2016, ఏప్రిల్ 29న విడుదలైన ‘సైరాట్’ చిన్న సినిమా. కానీ చాలా పెద్ద విషయాన్ని టచ్ చేసింది. ఎంతో బరువైన ప్రశ్నని సమాజం మీద బలంగా సంధించింది.  ఏడిపించింది. ఆలోచింపజేసింది. భాషా హద్దుల్ని చెరిపేసి, మహారాష్ట్ర సరిహద్దుల్ని దాటేసి.. దేశమంతా తన స్వరాన్ని  వినిపించింది. ఊహించనంత సంచలనం సృష్టించింది. అంతగా ఏముందీ సినిమాలో? ఉంది. చాలానే ఉంది. మనసుల్ని మెలిపెట్టేది, గుండెల్ని పిండేసేది ఎంతో ఉంది.

గుండెల్లో గూడు కట్టుకుపోయిన వ్యథ

రిక్షావోడి కొడుకు రిక్షానే తొక్కాలి. కూలి పని చేసేటోడి కొడుకు కూలోడే అవ్వాలి. ఎప్పటి నీతి ఇది? ఆకలి కేకల్ని పెడచెవిన పెట్టి, చదువుమీదే మనసును నిలబెట్టి, ఉన్నత స్థాయికి ఎదిగినవాళ్లు ఎంతమంది లేరు?  లేమిని వెనక్కి నెట్టి.. కష్టాలను కాలికింద తొక్కి.. ప్రపంచమంతా తలెత్తి తనవైపు చూసే స్థాయికి చేరుకున్నవాళ్లు ఎంతమంది లేరు! అలాంటివాళ్లే ప్రశాంత్‌కి స్ఫూర్తి. అతని తండ్రి చేపలు పడతాడు. ప్రశాంత్‌ క్లాసులో మంచి మార్కులు పడతాడు. లోకల్‌ క్రికెట్‌ టీమ్‌కి కెప్టెన్‌గా భారీ సిక్సులూ కొడతాడు. ఆ ప్రత్యేకతల ముందు పేదరికమైనా తలవంచాల్సిందే. కలిమి అయినా కదిలొచ్చి కావలించుకోవాల్సిందే.  కోటీశ్వరుడి కూతురైనా అతని కళ్లలో తన రూపాన్ని చూసుకోవాలని ఆరాటపడాల్సిందే! అర్చన అదే చేసింది. ప్రశాంత్‌ని ఇష్టపడింది. అతనితోనే జీవితమని కలలు కంది. డబ్బు, రాజకీయ పలుకుబడి ఉన్న బడాబాబు కూతురామె. విలాసాల్లో పుట్టి కులాసాగా పెరిగింది. బైక్ అయినా ట్రాక్టర్ అయినా ఇట్టా నడిపి పారేస్తుంది. ఎంతటి వాడినైనా కంటి చూపుతోనే ఆడించేస్తుంది. అలాంటి అమ్మాయి ప్రశాంత్‌తో ప్రేమలో మునిగిపోతుంది.

అయితే ప్రేమించినంత ఈజీ కాదు కదా ప్రేమని గెలిపించుకోవడం! అసలే వాళ్లు ఆస్తులు, అంతస్తులతోనే మనిషి విలువను అంచనా వేస్తారు. ఆడపిల్లని కంటిపాపలా కాక ఇంటి పరువులా భావిస్తారు. ఊరుకుంటారా! ఊరుకోరు. ఊరుకోలేదు. అర్చన ప్రేమ విషయం తెలియగానే తండ్రి అగ్గిమీద గుగ్గిలమవుతాడు. ప్రశాంత్‌ని కేసులో ఇరికించాలనుకుంటాడు. అవసరమైతే అంతం చేయాలనీ పన్నాగం పన్నుతాడు. వారి కుట్రలు, కుతంత్రాల నుంచి ప్రశాంత్‌ని అర్చన తప్పిస్తుంది. అతనితో కలిసి దూరంగా పారిపోతుంది. ప్రేమించినవాడితో కలిసి ఓ కొత్త నగరంలో సరికొత్త జీవితం మొదలుపెడుతుంది. విలాసాల మధ్య పెరిగిన పిల్లకి మురికివాడలో నివాసం. అరకొర వసతుల మధ్య జీవించాల్సిన అవసరం. మొదట కాస్త కష్టంగానే ఉంటుంది. మనసు నిండా ఏదో బెంగ అలముకుంటుంది. కాకపోతే కోరుకున్నవాడు పక్కనే ఉన్నాడనే తృప్తితో అడ్జస్ట్ అయిపోతుంది. వచ్చిన ప్రతి సమస్యనీ అధిగమించి చివరికి అతనికి భార్యవుతుంది. అతని బిడ్డకి తల్లీ అవుతుంది. అమ్మ అనే అనుభూతిని అనుభవించాక తన అమ్మ గుర్తొస్తుందో ఏమో.. ఆశగా తల్లికి ఫోన్ చేస్తుంది. తన కొడుకుతో కబుర్లు చెప్పిస్తుంది. అన్నేళ్ల బాధని ఆనందంగా మార్చుకుని మురిసిపోతుంది.

తర్వాత ఓరోజు ఉన్నట్టుండి అర్చన అన్నయ్య తనవాళ్లని, బోలెడన్ని బహుమతుల్నీ తీసుకుని వస్తాడు. చెల్లినీ, బావనీ మన్నించి వచ్చానంటాడు. ఆ మాటల్లోని మమకారానికి అర్చన ఆనందంతో పరవశించిపోతుంది. అన్నయ్య మనసులో పగ పేరుకుపోయిందని.. అది తన ప్రేమని పొట్టనబెట్టుకో వడానికే వచ్చిందని కనిపెట్టలేకపోతుంది. అన్నయ్య కాలనాగులా మారి ప్రతీకారంతో వేసి కాటుకి అక్కడికక్కడే అప్పటికప్పుడే ప్రాణాలు కోల్పోతుంది.. భర్తతో సహా.  ఇదీ ‘సైరాట్‌’ కథ. ఇది కేవలం సినిమా కథ కాదు. ఎన్నో యేళ్లుగా మన దేశంలో ముగింపు లేకుండా కొనసాగుతున్న కథ. పరువు హత్యల పేరుతో జరుగుతున్న వధ. వందల, వేల, లక్షల, కోట్ల మంది గుండెల్లో గూడు కట్టుకుపోయిన వ్యథ.

పరువు హత్యల కింద నలిగిపోతున్న ప్రేమ

ప్రేమ.. కేవలం రెండక్షరాల పదం. చిన్నగానే అనిపిస్తుంది. కానీ చిత్రవధ చేస్తుంది. అది ఒక్క మాటకే పుట్టేస్తుంది. ఒక్క చూపుతోనే చుట్టేస్తుంది. కానీ తనని గెలిపించాలంటే యుద్ధాలు చేయమంటుంది. కాసిన్ని కన్నీళ్లు వెదజల్లయినా సరే.. కులాల కుంపట్లని చల్లార్చమంటుంది. ఎంత కష్టమైనా పర్లేదు.. మతాల మంటని మమతల మంచుతో కప్పేయమంటుంది. అంతస్తుల్ని కూలగొట్టమంటుంది. అంతరాల్ని అణచిపెట్టమంటుంది. అవన్నీ చేయలేనివాడికి ప్రేమెందుకు అని అవహేళన కూడా చేస్తుంది. ఇది పెట్టే యాతన చెప్పనలవి కానిది. అయినా దాన్ని కోరుకోని మనసు ఉండదు. దాని వెంటపడని మనిషీ ఉండడు. ఎందుకంటే.. ప్రేమించడం రాని హృదయం హృదయం కాదు. ప్రేమ రుచి తెలియని జీవితం జీవితమూ కాదు. కానీ ఒక్కటే సమస్య. మనదేశంలో ప్రేమ సామ్రాజ్యాలు కులమతాల పునాదులపై నిర్మితమవుతాయి. పైకి ఎంతో గొప్పగా కనిపించినా వాటిలో అడుగు పెట్టాలంటే ఎన్నో అడ్డుగోడల్ని బద్దలుకొట్టాలి. బలవంతులు చిమ్మే ద్వేషం విషంగా మారి మన గొంతులోకి జారకుండా తప్పించుకోగలగాలి. కానీ పూర్తిగా వికసించని పసి హృదయాలకు అంత పరిణతి ఎలా ఉంటుంది? అప్పుడప్పుడే విచ్చుకుంటున్న రెక్కలకు అంత పెద్ద పోరాటం చేసేంత శక్తి ఎక్కడి నుంచి వస్తుంది? అందుకే తరాలు మారినా ఈ పాడు కట్టుబాట్ల పాదాల కింద ప్రేమ నలిగిపోతూనే ఉంది. పరువు హత్య పేరిట వేస్తున్న ఉరిలో చిక్కుకుని ఊపిరాడక విలవిల్లాడుతూనే ఉంది. 

తన చెల్లిని పెళ్లి చేసుకున్నాడనే కోపంతో ఓ దళిత యువకుడిని హైదరాబాద్ నగర నడిబొట్టున నరికి చంపాడో అన్న. ఓ పేదవాణ్ని ప్రేమించిందన్న కారణంతో కన్న కూతుర్నే కడతేర్చాడు పంజాబ్‌లో ఓ తండ్రి. ఇంటర్ క్యాస్ట్ మ్యారేజ్ చేసుకున్న జంటని బంధువులంతా కలిసి నరికి చంపేశారు బీహార్‌‌లో. ప్రేమించినవాడి కోసం వెళ్లిపోయిన అక్కని వెతికి పట్టుకుని, నలుగురితో గ్యాంగ్ రేప్ చేయించి మరీ ఉసురు తీశాడు ఓ తమ్ముడు ఉత్తర్‌‌ ప్రదేశ్‌లో. ఈ కర్కశత్వానికీ, రాక్షసత్వానికీ వాళ్లు చెప్పే కారణం.. ఇంటి పరువు. ‘తన వల్ల మా పరువు పోయింది, మా గౌరవానికి భంగం ఏర్పడింది, అందుకే చంపేశాం’. వాళ్ల లెక్కల ప్రకారం కులమేదో తెలుసుకున్నాకే కలలు కనాలి. మతమేదో చూసుకుని మనసులు ఇచ్చిపుచ్చుకోవాలి. ఆర్థిక స్థాయి అంచనా వేశాకే ఆశల గూళ్లు అల్లుకోవాలి. లేదంటే ప్రాణాలపై తీపి వదిలేసుకోవాలి. ఈ రాక్షస నీతి ఇప్పటికీ మన దేశంలో విచ్చలవిడిగా రాజ్యమేలుతోంది. దీన్నే చూపించాలనుకున్నాడు ‘సైరాట్’ దర్శకుడు నాగరాజ్ మంజులే. అయితే పరువు హత్యలోని పెయిన్ తెలియాలంటే ముందు ఆ ప్రేమలోని లోతు తెలియాలి. అందుకే ఓ అందమైన ప్రేమకథను అల్లాడు.

అలాగని ఈ కథ ఎక్కడా విననిది, ఎప్పుడూ చూడనిది కాదు. మన కళ్లముందే ఎన్నోసార్లు జరిగింది. మన ఊరిలో చూసుండొచ్చు. ఏ పుస్తకంలోనో చదివుండొచ్చు. ఏదైనా సినిమాలోనూ చూపించి ఉండొచ్చు. డబ్బున్న అమ్మాయి పేదోడిని ప్రేమించడం చాలా సాధారణమైన విషయం. అయితే దాన్ని గతంలో చూడనంత కొత్తగా, అద్భుతంగా చూపించడమే నాగరాజ్‌ విజయం. ఆయన ఆలోచనల్ని హీరోయిన్ రింకు రాజ్‌గురు, హీరో ఆకాష్‌లు బాగా అర్థం చేసుకున్నారు. అందుకే అర్చన, ప్రశాంత్‌ల పాత్రల్లోకి అంతగా ఇమిడిపోయారు. అసలు వీళ్లిద్దరూ నటిస్తున్నారా లేక నిజంగానే ప్రేమలో ఉన్నారా అనిపిస్తుంది చూస్తున్నంతసేపూ. కళ్లతో చెప్పుకునే ఊసులు.. నవ్వులతో చేసుకునే బాసలు.. కలిసి నడిచే క్షణాలు.. కష్టాలు పంచుకునే అనుభవాలు.. ఇద్దరూ కలిసి ఆస్వాదించే అందమైన అనుభూతులు.. ప్రతిదీ చూడముచ్చటగా ఉంటుంది. అందుకే అందరికీ సినిమా చూడబుద్ధైంది. కానీ ఊహించని ఆ ముగింపు మాత్రం ఉలిక్కిపడేలా చేసింది. గుండెల్ని బరువెక్కించింది. కన్నుల్ని నీటి చెలమల్ని చేసింది. మది నిండా వ్యథను నింపి సాగనంపింది. బాధ ఎవరికైనా బాధే. అందుకే తమ భాషలో రాని ఈ సినిమాని తమకా భాష రాదనే సంగతి కూడా మర్చిపోయి లీనమై చూశారు ప్రేక్షకులు. 

నాగరికత పెరిగితే చాలదు.. మనుషులు మారాలి

ప్రపంచాన్ని మెప్పించే సినిమా తీయాలంటే ప్రపంచం మొత్తాన్నీ అందులో చూపించక్కర్లేదు. మన చుట్టూ జరుగుతున్నది చూపిస్తే చాలు. నిజాల్ని నిర్భయంగా జనం కళ్ల ముందుంచితే చాలు. అదే చేశాడు నాగరాజ్. మన సమాజానికి మచ్చగా మిగిలిన పరువుహత్యని ఎంతో హృద్యంగా తెరకెక్కించాడు. గట్స్ ఉన్న డైరెక్టర్ అనిపించుకున్నాడు. దాదాపు మూడు గంటల నిడివి ఉన్న సినిమాలో రెండున్నర గంటలకు పైగా వినోదం ఉన్నా.. చివర్లో కనిపించిన విషాదం మాత్రం మననుల్ని మెలిపెట్టేసింది.  సంతోషాన్ని మర్చిపోయినంత తేలికగా బాధని మర్చిపోలేం కదా. వద్దన్నా అది పదే పదే గుర్తొస్తుంది. గుచ్చి గుచ్చి వేధిస్తుంది. ‘సైరాట్’ అదే చేసింది. అందుకేనేమో.. ఈ సినిమా చూసిన ఏ ప్రేక్షకుడూ ఓ పట్టాన తేరుకోలేకపోయాడు. ఎంత చక్కని జంట.. ఎలా చంపగలిగారు అనే ప్రశ్న వాళ్లని కుదురుగా ఉండనివ్వలేదు. కునుకు పట్టనివ్వలేదు. ఇప్పుడు సినిమాని గుర్తు చేసుకున్నా  ఆ ప్రశ్న వెంటనే మనసులో మెదలకుండా ఉండదు. కాలాలు మారితే చాలదు. మనుషులు మారాలి. నాగరికత పెరిగితే చాలదు. నేను, నాది అనే స్వార్థం వీడాలి. ఇంటర్నెట్‌లో ప్రపంచం మొత్తాన్నీ చదివేస్తే చాలదు. ముందు మనవారి మనసుల్ని చదవాలి. ఎవరో ఏదో అనుకుంటారని బతకడం కాదు. ఏం చేస్తే ఎవరినీ బాధపెట్టకుండా ఉంటాం అని ఆలోచించి అడుగేయాలి. అప్పుడే ఇలాంటివన్నీ ఆగుతాయి. లేదంటే వంద ‘సైరాట్‌’లు వచ్చినా పరిస్థితులు అలాగే ఉంటాయి. పరువు హత్యలు జరుగుతూనే ఉంటాయి.

సైరాట్ సంగతులు:

  • ఈ సినిమాని కేవలం నాలుగు కోట్ల బడ్జెట్‌తో తీశారు. కానీ ప్రపంచవ్యాప్తంగా నూట పది కోట్లు రాబట్టింది. ఓ మరాఠీ సినిమా ఇంత గ్రాస్‌ని రాబట్టడం ఇదే మొదటిసారి.
  • ఈ సినిమా బెర్లిన్ ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్లో ప్రదర్శితమైంది. సినిమా చూశాక లేచి స్టాండింగ్ ఒవేషన్ ఇచ్చేంతగా అందరికీ నచ్చింది.
  • ఈ సినిమాలో నటించినవారంతా కొత్తవారే. హీరోయిన్ రింకూ రాజ్‌గురు అయితే హీరోయిన్‌గా సెలెక్టయ్యే సమయానికి ఏడో తరగతి చదవుతోంది. కానీ తన నటనతో శభాష్ అనిపించింది. నేషనల్ అవార్డ్ కూడా అందుకుంది.
  • తాను స్వయంగా చూసిన సంఘటన స్ఫూర్తితో ఈ సినిమా తీశాడు దర్శకుడు నాగరాజ్. అందుకే తన సొంత ఊరిలోనే షూట్ చేశాడు.
  • ఈ చిత్రాన్ని బాలీవుడ్‌లో ‘ధడక్’ పేరుతో రీమేక్ చేశారు. జాన్వీకపూర్‌‌ ఈ సినిమాతోనే ఎంట్రీ ఇచ్చింది. ఆమెకి జంటగా ఇషాన్ ఖత్తర్ నటించాడు. అయితే మరాఠీలో సక్సెస్ అయినంతగా హిందీలో అవ్వలేదు.
  •