‘అమ్మ లేమ్మ..’ తల్లి శవం దగ్గర రెండేళ్ల పిల్లాడు

‘అమ్మ లేమ్మ..’ తల్లి శవం దగ్గర రెండేళ్ల పిల్లాడు
  • తల్లి చనిపోయిందని కూడా తెలియని దుస్థితి
  • కంటతడి పెట్టిస్తున్న వీడియో

పాట్నా: బీహార్‌‌లోని ముజ్‌ఫర్‌‌పూర్‌‌ రైల్వే స్టేషన్‌లో తీసిన ఒక వీడియో అందర్నీ కంట తడి పెట్టిస్తోంది. వలస కార్మికురాలు తిండి లేక, ఎండ దెబ్బతో చనిపోతే తల్లి చనిపోయిందని తెలియని తన రెండేళ్ల పిల్లాడు శవం పక్కనే కూర్చొని ఆడుకున్న ఘటన అందరి హృదయాలను కదిలించింది. శవంపై కప్పిన దుప్పటిని తీసి ఆమెను లేపేందుకు ప్రయత్నించిన పిల్లాడ్ని చూసి అక్కడి వారంతా కన్నీరు పెట్టుకున్నారు. తల్లి చనిపోయిందని తెలుసుకోలేని ఆ పిల్లాడు ఫ్లాట్‌ఫాం మొత్తం తిరుగుతూ ఆడుకుంటున్న వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతోంది. ముజ్‌ఫర్‌‌నగర్‌‌కు చెందిన ఒక మహిళ పనుల కోసం గుజరాత్‌ వలస వెళ్లింది. లాక్‌డౌన్‌ కారణంగా పనులు లేకపోవడంతో శ్రామిక్‌ రైలులో ముజఫర్‌‌నగర్‌‌కు బయలుదేరింది. కాగా.. ట్రైన్‌లో తినేందుకు తిండి లేక, ఎండ దెబ్బకు కుప్పకూలిపోయింది. రేలు ముజఫర్‌‌నగర్‌‌కు చేరుకోగానే చూసిన తోటి వారు ఆమె శవాన్ని ఫ్లాట్‌ఫాంపై పడుకోబెట్టారు. మహిళతో రెండేళ్ల కొడుకు కూడా ఉన్నాడు. తల్లి చనిపోయిందని తెలియని ఆ పసిపిల్లాడు ఆమెను లేపేందుకు ప్రయత్నించాడు. ఆమె ఎంత సేపటికీ లేవకపోవడంతో ఫ్లాట్ ఫాం మొత్తం తిరుగుతూ ఆడుకున్నాడు.