తిరుమలలో భక్తుల రద్దీ.. దర్శనానికి 24 గంటలు

తిరుమలలో భక్తుల రద్దీ.. దర్శనానికి 24 గంటలు

భక్తులతో తిరుమల కొండ కిటకిటలాడుతోంది. భక్తుల రద్దీ  కొనసాగుతోంది. శ్రీవారిని దర్శించుకోవడానికి భక్తులు పెద్ద సంఖ్యలో తిరుమలకు పోటెత్తారు.   టోకెన్ రహిత సర్వదర్శనానికి క్యూ కాంప్లెక్స్‌లోని కంపార్టుమెంట్లన్నీ నిండి క్యూ లైన్లు వెలుపలికి వచ్చాయి. శ్రీవారి సర్వదర్శనానికి 24 గంటల సమయం పడుతోంది. గురువారం ( జూన్ 22) 67,294 మంది భక్తులు శ్రీవారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. గురువారం ( జూన్ 22)   శ్రీవారి హుండీ ఆదాయం 4.09 కోట్ల రూపాయలు వచ్చినట్టు తిరుమల తిరుపతి దేవస్థానం వెల్లడించింది. 33,529 మంది భక్తులు తలనీలాలు సమర్పించారు.

తిరుమలకు వచ్చే భక్తులు ఫేక్ వెబ్ సైట్స్ నుంచి ఫేక్ దర్శన టోకెన్లతో మోసపోవద్దని పోలీసులు శ్రీవారి భక్తులకు సూచించారు. తిరుమలలో ఎలాంటి ఆధారాలు లేకుండా అక్రమంగా నివాసం ఉంటున్న వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని తిరుపతి జిల్లా ఎస్పీ పరమేశ్వరరెడ్డి హెచ్చరించారు. ఒకవేళ ఎవరైనా అలాంటి వారికి ఇళ్లు అద్దెకిస్తే యజమానులపైనా క్రిమినల్‌ కేసులు నమోదు చేస్తామన్నారు. భక్తుల ముసుగులో కొందరు నేరస్థులు తలదాచుకుంటున్నారని అన్నారు. తిరుమల ఘాట్ రోడ్ గురించి సరైన అవగాహన, ఘాట్ ఫిట్నెస్ లేనటువంటి ఇతర రాష్ట్రాలకు చెందిన తుఫాన్, టెంపో ట్రావెలర్ వంటి వాహనాలు వస్తున్నాయని.. ఈ వాహనాలు తిరుమలకు అనుమతించడం వలన ఘాట్ రోడ్ పై తరచుగా రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయని ఎస్పీ అన్నారు. ఇటువంటి వాహనాలను తిరుమలకు అనుమతించకుండా సప్తగిరి టోల్ ప్లాజా వద్ద ప్రత్యేక చర్యలు తీసుకుంటామని అన్నారు.