రైతుల చలో ఢిల్లీ .. బార్డర్లలో భారీగా పోలీసుల మోహరింపు

రైతుల చలో ఢిల్లీ ..   బార్డర్లలో భారీగా పోలీసుల మోహరింపు

న్యూఢిల్లీ: కనీస మద్దతు ధర(ఎంఎస్పీ)కి చట్టబద్ధత, అగ్రి చట్టాలకు వ్యతిరేకంగా నిరసనల్లో పాల్గొన్న రైతులపై కేసుల ఎత్తివేత, ఇతర డిమాండ్ల సాధన కోసం ఉత్తరాది రాష్ట్రాల రైతులు మరోసారి ఢిల్లీ బాట పట్టేందుకు సిద్ధమయ్యారు. దీంతో దేశ రాజధాని ఢిల్లీ బార్డర్లలో పోలీసులు భారీగా మోహరించారు. పలు చోట్ల 144 సెక్షన్ విధించారు. బారికేడ్లతో రోడ్లను మూసివేశారు.

డిమాండ్ల సాధన కోసం మంగళవారం చేపట్టనున్న  ‘ఢిల్లీ చలో మార్చ్’కు భారీగా తరలిరావాలంటూ సంయుక్త కిసాన్ మోర్చా (నాన్ పొలిటికల్), కిసాన్ మజ్దూర్ యూనియన్ నేతలు ఇదివరకే పిలుపునిచ్చారు. పంజాబ్, హర్యానా, యూపీ, రాజస్థాన్, మధ్యప్రదేశ్ రాష్ట్రాల నుంచి సుమారు 200 సంఘాల ఆధ్వర్యంలో రైతులు పెద్ద ఎత్తున ఈ ర్యాలీకి రానున్నట్లు భావిస్తున్నారు. ఈ సారి డిమాండ్లు నెరవేరేదాకా ఢిల్లీ బార్డర్లలోనే తిష్ట వేయాలని రైతు సంఘాలు భావిస్తున్నాయని అధికారులు అంచనాకు వచ్చారు. ఈ నేపథ్యంలో సోమవారం చర్చలకు రావాలంటూ ఆయా సంఘాల నేతలకు కేంద్రం పిలుపునిచ్చింది. 

నార్త్ ఈస్ట్ ఢిల్లీలో 144 సెక్షన్.. 

రైతుల ఢిల్లీ చలో మార్చ్ నేపథ్యంలో నార్త్ ఈస్ట్ ఢిల్లీలో 144 సెక్షన్ విధించినట్లు డిప్యూటీ పోలీస్ కమిషనర్ జాయ్ టిర్కీ వెల్లడించారు. శాంతి భద్రతలకు భంగం కలగకుండా చూసేందుకు భారీగా పోలీసులను మోహరించినట్లు తెలిపారు. అనుమతి లేకుండా ఆందోళనకారులు వస్తే.. అడ్డుకుంటామని చెప్పారు. తుపాకులు, కత్తులు, రాడ్లు, కట్టెల వంటివి తీసుకొస్తే వెంటనే అరెస్ట్ చేస్తామని హెచ్చరించారు.

రైతులు ముందుకు దూసుకుని వస్తే.. టియర్ గ్యాస్ షెల్స్ ప్రయోగించేలా డ్రిల్స్ నిర్వహిస్తున్నారు. నార్త్ ఢిల్లీలోని ఒక ఓపెన్ ఏరియాలో పోలీసులు వరుసగా నిలబడి టియర్ గ్యాస్ షెల్స్ పేలుస్తున్న వీడియో తాజాగా మీడియాలో వైరల్ అయింది. ఈ డ్రిల్​తో స్థానికులు కండ్లల్లో మంట, నీళ్లు కారుతూ, ఊపిరాడనట్లుగా ఇబ్బందులు పడ్డారని ‘ఏఎన్ఐ’ సంస్థ వెల్లడించింది.

2 వేల ట్రాక్టర్లతో 20 వేల మంది నిరసనలు? 

ఢిల్లీ చలో మార్చ్​లో దాదాపు 2 వేల ట్రాక్టర్లతో 20 వేల మంది రైతులు నిరసనల్లో పాల్గొనేలా ప్లాన్ చేసినట్లు నిఘా వర్గాలు గుర్తించాయి. పంజాబ్, హర్యానా, యూపీ, రాజస్థాన్, మధ్యప్రదేశ్ రాష్ట్రాలతో పాటు కేరళ, కర్నాటక నుంచి సైతం రైతులు ఢిల్లీకి చేరుకున్నట్లు హెచ్చరించాయి. ముందస్తుగా ఢిల్లీలోకి వేర్వేరుగా ఎంటరై మంగళవారం ఒక్కసారిగా ప్రధాని, మంత్రులు, బీజేపీ నేతలు, వీఐపీల ఇండ్ల ముందు గుమిగూడాలని నిర్ణయించినట్లు నిఘా వర్గాలు తెలిపాయి.

ఇప్పటికే పంజాబ్, హర్యానాలో రైతులు ట్రాక్టర్లతో రిహార్సల్స్ చేసిన వీడియోలు సైతం మీడియాలో వైరల్ అయ్యాయి. కాగా, రైతులు ప్రవేశించే అవకాశం ఉందని హర్యానాలోకి శంభూ వద్ద రాష్ట్ర సరిహద్దును పోలీసులు మూసివేశారు. రోడ్డుపై కాంక్రీట్ బ్లాకులు, ఇసుక బస్తాలు, ముండ్ల కంచెలు, మేకులు ఏర్పాటు చేశారు.

ఇది అమృతకాలమా? అన్యాయకాలమా?: ప్రియాంక గాంధీ

రైతులు నిరసన తెలిపేందుకు వస్తుంటే బారికేడ్లు పెడ్తూ, మేకులు కొడ్తూ అడ్డుకోవాలని చూడటం దారుణమని కాంగ్రెస్ నేత ప్రియాంక గాంధీ మండిపడ్డారు. రోడ్డుపై బారికేడ్లు పెడుతున్న వీడియోను ఆమె ఆదివారం ట్వీట్​ చేశారు.

‘‘మిస్టర్ ప్రైమ్ మినిస్టర్.. దేశ రైతుల పట్ల ఇదేం తీరు? రైతులకు ఇచ్చిన హామీలను ఎందుకు నెరవేర్చలేదు? రైతుల తోవలో కంచెలు, మేకులు ఏర్పాటు చేయడం అమృతకాలమా? లేక అన్యాయ కాలమా?” అని ఆమె మండిపడ్డారు. ‘‘తమ కష్టాలను చెప్పుకునే హక్కు కూడా రైతులకు లేదా? ప్రభుత్వమే వినకపోతే వారు ఎక్కడికి వెళ్లాలి?” అని ప్రశ్నించారు.