హైదరాబాద్ లో దంచికొట్టిన వాన... లోతట్టు ప్రాంతాలు జలమయం..

హైదరాబాద్ లో దంచికొట్టిన వాన... లోతట్టు ప్రాంతాలు జలమయం..

హైదరాబాద్ లో గురువారం ( జూన్ 12 ) తెల్లవారుజామున వర్షం దంచికొట్టింది.  సిటీ శివారు ప్రాంతాలైన మైలార్ దేవ్ పల్లి, ఆరాంఘర్, రాజేంద్రనగర్, అత్తాపూర్, బండ్లగూడ జాగిర్ కార్పొరేషన్, కిస్మత్ పూర్, హైదర్ షాకోట్, హిమాయత్ సాగర్ తదిత ప్రాంతాల్లో వర్షం కురిసింది. ఎడతెరపి లేకుండా కురిసిన వర్షానికి లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి.సిటీలోని లింగంపల్లి, చందానగర్, మియాపూర్, కొండాపూర్, గచ్చిబౌలి, మాదాపూర్ ప్రాంతాల్లో కూడా వర్షం కురిసింది. లింగంపల్లి రైల్వే అండర్ బ్రిడ్జి కింద భారీగా చేరిన వరద నీరు చేరడంతో రాకపోకలు నిలిచిపోయాయి. 

చందానగర్ లోని పలు కమర్షియల్ కాంప్లెక్స్ ల సెల్లార్ లోకి భారీగా వరద నీరు చేరింది. విజేత సూపర్ మార్కెట్ సెల్లార్ తోపాటు  పలు దుకాణాలోని సెల్లార్ లో నిలిచిన నీరు చేరింది. హైడ్రా టీమ్స్ నీటిని క్లియర్ చేస్తున్నారు. ఇదిలా ఉండగా.. రాష్ట్రవ్యాప్తంగా రానున్న నాలుగు రోజులు భారీ వర్షాలు కురుస్తాయని సూచించింది వాతావరణశాఖ. ఉత్తరాంధ్ర కోస్తా సమీపంలోని పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో సగటు సముద్ర మట్టం నుంచి 5.8 కి.మీ ఎత్తులో ఉపరితల ఆవర్తనం ఏర్పడినట్లు తెలిపింది వాతావరణ శాఖ.

ఉపరితల ఆవర్తనం ప్రభావంతో రాష్ట్రంలో భారీ వర్షాలతో పాటు గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీస్తాయని..   ఉరుములు మెరుపులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది వాతావరణశాఖ. బుధవారం ( జూన్ 11 ) రాత్రి హైదరాబాద్ తో పాటు రాష్ట్ర వ్యాప్తంగా పలు జిల్లాల్లో వాన దంచికొట్టింది.శేరిలింగంపల్లి పరిధిలో అత్యధికంగా 14.83 సెంటీమీటర్ల వర్షపాతం నమోదు కాగా.. లింగంపల్లి లో 11.40 సెంటీమీటర్లు, నల్గొండ లో 9.1, నాగర్ కర్నూల్ లో 8.6, వనపర్తి లో 8.1 సెంటీమీటర్ల వర్షపాతం నమోదయ్యింది.