
రానున్న మూడు రోజుల్లో రాష్ట్రంలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. తూర్పు మధ్య బంగాళాఖాతంలో తీవ్ర అల్పపీడనం ఏర్పడిందని, దీనికి అనుబంధంగా ఉపరితల ఆవర్తనం కొనసాగుతుందని పేర్కొంది. దక్షిణ కోస్తాంధ్ర పరిసర ప్రాంతాల్లో 1.5 కిలోమీటర్ల ఎత్తులో ఉపరితల ఆవర్తం కొనసాగుతుందని చెప్పింది. తీవ్ర అల్పపీడనం రాగల 24 గంటల్లో వాయుగుండంగా మారే అవకాశం ఉందని పేర్కొంది. అలాగే ఈ నెల 14న మరో అల్పపీడనం ఏర్పడే అవకాశాలున్నాయంది. దీని ప్రభావంతో రాష్ట్రంలో రాగల మూడు రోజుల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పడుతాయని చెప్పింది.
ఆదిలాబాద్, కరీంనగర్, వరంగల్ ఉమ్మడి జిల్లాల్లో కొన్ని చోట్ల భారీ వర్షాలు, ఖమ్మం, సూర్యాపేట జిల్లాల్లో ఒకట్రెండు చోట్ల భారీ వర్షాలు కురుస్తాయని, ఆది, సోమవారాల్లో ఒకటి రెండు చోట్ల భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది.