సంక్రాంతి సెలవులు రావడంతో పట్నం పల్లెకు బయలెల్లింది. ఫలితంగా సిటీలోని ప్రధాన బస్టాండ్లు, రైల్వే స్టేషన్లలో భారీ రద్దీ నెలకొంది. ఎల్బీ నగర్, ఎంజీబీఎస్, జేబీఎస్, శివారులోని ఉప్పల్ రింగ్ రోడ్, కూకట్పల్లి, ఆరంఘర్ చౌరస్తా, గచ్చిబౌలి, హైటెక్ సిటీ, లింగంపల్లి, ఎల్బీ నగర్, దిల్ సుఖ్ నగర్ ,హయత్ నగర్ లోని బస్టాండ్లలో ప్రయాణికులు కిక్కిరిసిపోయారు. ఇప్పటికే దాదాపు 30 లక్షల మంది ప్రయాణికులు సిటీని వదిలి ఊళ్లకు వెళ్లారని సమాచారం.
ఇవాళ ఆదివారం కావడం ఈ రద్దీ మరింత ఎక్కువైంది . రాత్రి నుంచి ప్రయాణికులు రోడ్లపై నిల్చున్నారు. తెల్లారినా రష్ తగ్గడం లేదు. ప్రత్యేక బస్సులు ఏర్పాటు చేసినా జనం భారీగా తరలివస్తుండటంతో బస్సుల కోసం ప్రయాణికులు ఎదురుచూడాల్సి వస్తోంది. ఇదే అదనుగా ప్రైవేటు వెహికల్స్ భారీగా చార్జీలు పెంచి అందినకాడికి దోచుకుంటున్నారు. ప్రయాణికులు భారీగా తరలిరావడంతో ఆయా రూట్లలో ట్రాఫిక్ స్తంభించింది. -
సంక్రాంతి పండగ సందర్భంగా ఉప్పల్ రింగ్ రోడ్డు నుంచి వరంగల్, భువనగిరి, యాదగిరిగుట్ట,మహబూబాబాద్ తదితర ప్రాంతాలకు వెళ్ళే ప్రయాణికులు బస్టాండ్లలో బస్సుల కోసం ఎదురుచూస్తున్నారు. ప్రయాణికులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా అర్టీసీ ఏర్పాట్లు చేసిందని అధికారులు తెలిపారు. మహాలక్ష్మి పథకం కు వెళ్లే ప్రయాణికుల కొరకు బస్సుల సంఖ్యను పెంచామని తెలిపారు.
