ఎయిర్ షో ఎఫెక్ట్: బేగంపేట్-సికింద్రాబాద్ రూట్‎లో భారీగా ట్రాఫిక్ జామ్

ఎయిర్ షో ఎఫెక్ట్: బేగంపేట్-సికింద్రాబాద్ రూట్‎లో భారీగా ట్రాఫిక్ జామ్

హైదరాబాద్: బేగంపేట్ టూ సికింద్రాబాద్ వెళ్లే రూట్లో భారీగా ట్రాఫిక్ జామ్ నెలకొంది. బేగంపేట్ విమానాశ్రయంలో ఎయిర్ షో నడుస్తుండటంతో ఎయిర్ పోర్ట్‎కు సందర్శకుల తాకిడి ఎక్కువైంది. దీంతో ఈ మార్గంలో వాహనాల రద్దీ పెరిగి భారీగా ట్రాఫిక్ జామ్ నెలకొంది. కిలో మీటర్ల మేర వాహనాలు నిలిచిపోయాయి. ప్రయాణికులు, వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. రంగంలో దిగిన ట్రాఫిక్ పోలీసులు వాహనాల రద్దీని క్లియర్ చేస్తున్నారు.

బేగంపేట్‎లో  ‘వింగ్స్ ఇండియా –2026’ ఎయిర్ షో:

ఆసియాలోనే అతిపెద్ద ఎయిర్​ షో  ‘వింగ్స్ ఇండియా –2026’కు హైదరాబాద్ వేదికైంది. ప్రపంచ విమానయాన భవిష్యత్తును ప్రదర్శించేలా బేగంపేట ఎయిర్ పోర్ట్‎లో ఈ నెల 28 నుంచి 31 వరకు ఈ షో జరుగుతోంది.  ‘భారతీయ విమానయానం’ థీమ్‎తో ఈ వేడుక నిర్వహిస్తున్నట్లు కేంద్ర పౌర విమానయాన శాఖ తెలిపింది. డిజైన్ నుంచి విస్తరణ, తయారీ నుంచి నిర్వహణ, చేరిక నుంచి ఆవిష్కరణ, భద్రత నుంచి స్థిరత్వం వరకు ఈ కార్యక్రమం సాగనున్నట్లు వెల్లడించింది. ఈ నాలుగు రోజుల వేడుకలో దేశంలో వేగంగా విస్తరిస్తున్న విమానయాన రంగం, ప్రపంచ వ్యాప్తంగా విజయాలు, తయారీ, సేవలు, ఆవిష్కరణ తదితర అంశాలను హైలెట్ చేయనున్నట్లు పేర్కొంది.

అంతర్జాతీయ విమానరంగ దిగ్గజ సంస్థలు ఈ వింగ్స్ ఇండియా షోలో పాల్గొంటున్నాయి. విమాన ఇంజిన్ తయారీదారులు, ఎంఆర్వోలు, విమానాశ్రయ డెవలపర్లు, ఓఈఎంలు, సాంకేతిక నిపుణులు, శిక్షణ సంస్థలు తరలివచ్చాయి. ఎయిర్ షో తో పాటు స్టాటిక్ ఎయిర్ క్రాప్ట్ డిస్ ప్లే, ఫ్లయింగ్, ఏరో బాటిక్ షోలు, సీఈఓ రౌండ్ టేబుల్ మీటింగ్స్, బీ2 బీ, బీ2 జీ సమావేశాలు జరగుతున్నాయి. ఏవియేషన్ జాబ్ ఫెయిర్, అవార్డుల ప్రదానం, సాంస్కృతిక నృత్యాలు నిర్వహించనున్నారు.