
మాస్కులు, గ్లోవ్స్ల ఎగుమతిపై చైనా వరకు నిషేధం ఎత్తివేత
మిగతా దేశాలకు యథావిధిగా నిషేధం
811కు పెరిగిన కరోనా మృతులు
కరోనాపై జిన్పింగ్కు లెటర్ రాసిన మోడీ
న్యూఢిల్లీ: కరోనా వైరస్పై పోరాటంలో అవసరమైతే సాయం చేస్తామని చైనాకు కేంద్రం ఆఫర్ ఇచ్చింది. ఆదివారం చైనా ప్రెసిడెంట్ షి జిన్పింగ్కు ప్రధాని నరేంద్ర మోడీ లేఖ రాసినట్టు అధికారులు తెలిపారు. కరోనాతో అతలాకుతలమవుతున్న జనానికి సానుభూతి ప్రకటించారన్నారు. హుబెయ్ ప్రావిన్స్ నుంచి 650 మంది ఇండియన్లను తరలించడంలో సహకరించినందుకు జిన్పింగ్కు మోడీ కృతజ్ఞతలు తెలిపారన్నారు. కాగా, కరోనాతో ఫైట్లో భాగంగా సర్జికల్ మాస్కులు, డిస్పోజబుల్ మాస్కుల ఎగుమతిపై విధించిన నిషేధాన్ని కేంద్రం ఎత్తేసింది. నిషేధం ఎత్తివేతపై ప్రతిపక్షాల నుంచి విమర్శలు ఎదురవుతున్నా, చైనాకు సాయం చేయాలన్న ఉద్దేశంతో ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. నైట్రైల్ బ్యుటాడయీన్ రబ్బర్ గ్లోవ్స్ తప్ప ఇతర గ్లోవ్స్, సర్జికల్ మాస్కులను చైనాకు ఎగుమతి చేసుకునే అవకాశం కల్పించింది. శనివారం డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ ఫారిన్ ట్రేడ్ ఉత్తర్వులిచ్చింది. చైనాకు తప్ప మిగతా దేశాలకు మాస్కులు, గ్లోవ్ల ఎగుమతిపై మాత్రం నిషేధం ఉంటుందని తెలిపింది. చైనాలో ఫస్ట్ కరోనా వైరస్ కేసు నమోదైన నేపథ్యంలో జనవరి చివరి వారంలో వాటిపై నిషేధం విధించింది. దాని తీవ్రత పెరిగిపోతున్న క్రమంలో ఆ నిషేధాన్ని చైనా వరకు ఎత్తేసింది.
మృతులు 811
కరోనా వైరస్కు బలైన వారి సంఖ్య 811కి పెరి గింది. బాధితుల సంఖ్య 37,198కి చేరింది. శనివారం ఒక్కరోజే 89 మంది వైరస్ వల్ల చనిపోయారని, హుబెయ్ ప్రావిన్స్లోనే 81 మంది మరణించారని చైనా నేషనల్ హెల్త్ కమిషన్ ప్రకటించింది. కొత్తగా 2,656 కేసులు నమోదయ్యాయని తెలిపింది. చైనా సాయం కోరిన నేపథ్యంలో ఇంటర్నేషనల్ టీమ్ను పంపుతామని ఐక్యరాజ్యసమితి డైరెక్టర్ జనరల్ టెడ్రోస్ అధనోమ్ ఘెబ్రియేసస్ తెలిపారు. ముందుగా టీమ్ లీడర్ వెళతారని, ఆ తర్వాత మిగతా సభ్యులూ అక్కడకు చేరుకుంటారని చెప్పారు. కాగా, కరోనా వైరస్ గురించి ముందే హెచ్చరించిన డాక్టర్ లి వెన్లియాంగ్ నోరు మూయించడం వల్ల పరిస్థితి మరింత దారుణంగా తయారైందని అక్కడి జనం మండిపడుతున్న సంగతి తెలిసిందే. అతడు చనిపోయాక చైనా ప్రభుత్వాన్ని జనం విమర్శిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే కరోనా వైరస్ ప్రభావం గురించి నిజాలను జనానికి చేరవేస్తున్న షెన్ ఖాయిషీ అనే జర్నలిస్టు నోరునూ చైనా ప్రభుత్వం మూసేస్తోందన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. జనవరి 24న వుహాన్కు వెళ్లిన షెన్ను అక్కడి అధికారులు క్వారెంటైన్ పేరుతో బంధించారని అతడి కుటుంబ సభ్యులు, స్నేహితులు ఆరోపించారు. కరోనా ఎఫెక్ట్తో చైనా రాజధాని బీజింగ్, షాంఘైలు జనాలు లేక ఖాళీగా కనిపించాయి.
ఇండియాకు ముప్పే
కరోనా వైరస్తో ఇండియాకు పెద్ద ముప్పే పొంచి ఉందని జర్మనీకి చెందిన హంబోల్డ్ యూనివర్సిటీ, రాబర్ట్ కోచ్ ఇనిస్టిట్యూట్లు చేసిన స్టడీలో తేలింది. వైరస్ బాగా వ్యాపించే 20 దేశాల లిస్టులో ఇండియా 17వ స్థానంలో ఉందని చెప్పింది. ప్రపంచంలోని 4 వేల ఎయిర్పోర్టుల ఎయిర్ట్రాఫిక్ ప్యాటర్న్లను అంచనా వేసిన సైంటిస్టుల టీం, ఆయా రూట్లలో చైనా నుంచి 25 వేల డైరెక్ట్ రాకపోకలు జరిగాయని తేల్చింది. ఇండియాకు ఉన్న రిలేటివ్ ఇంపోర్ట్ రిస్క్ (వైరస్కు ఎఫెక్ట్ అయిన ప్రాంతం నుంచి ఆ వైరస్ సోకిన జనాల ప్రయాణం) 0.219 శాతమని
పేర్కొంది.
గాంధీకి మరో 2 కరోనా సస్పెక్టెడ్ కేసులు
హైదరాబాద్, వెలుగు: కరోనా లక్షణాలతో గాంధీ హాస్పిటల్లో ఆదివారం మరో ఇద్దరు అడ్మిట్ అయ్యారు. వాళ్లిద్దరినీ అబ్జర్వేషన్ కోసం ఐసోలేషన్ వార్డులో పెట్టామని నోడల్ ఆఫీసర్, డాక్టర్ విజయ్ కుమార్ తెలిపారు. వాళ్ల శాంపిళ్లు తీసుకుని టెస్టుల కోసం పంపామన్నారు. శనివారం వచ్చిన తొమ్మిది మందికి టెస్టులు నెగెటివ్ వచ్చాయన్నారు. ఇప్పటిదాకా 70 మందికి టెస్టులు చేశామని, వాళ్లెవరికీ వైరస్ లేదని ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్ ఒక ప్రకటనలో వెల్లడించారు.
కరోనాను జయించిండు
కరోనా వైరస్ సోకిన గర్భిణీ పండంటి మగబిడ్డకు జన్మనిచ్చింది. అయితే, ఆ బుడ్డోడు మాత్రం మస్తు లక్కీ ఫెలో. ఎందుకంటే, అమ్మ ఒంట్లో ఉన్న వైరస్, ఆ బుడ్డోడికి సోకలేదు. ఈ ఘటన చైనా ఝెజియాంగ్ ప్రావిన్స్లో శనివారం జరిగింది. హాంగ్జూలోని చిల్డ్రెన్స్ హాస్పిటల్ ఆఫ్ ఝెజియాంగ్ యూనివర్సిటీ స్కూల్ ఆఫ్ మెడిసిన్లో ఆ చిన్నారికి డీఎన్ఏ టెస్టులు చేయగా రిపోర్టులు నెగెటివ్ వచ్చాయి. అయితే, కొన్ని రోజుల పాటు అబ్జర్వేషన్లో పెట్టి, మళ్లీ టెస్టులు చేసి నిర్ధారిస్తామని డాక్టర్లు చెబుతున్నారు.