న్యూఢిల్లీ: టూవీలర్ తయారీ కంపెనీ హీరో మోటోకార్ప్ , 2026–27 ఆర్థిక సంవత్సరంలో రూ.1,500 కోట్లను ఇన్వెస్ట్ చేయాలని నిర్ణయించింది. ‘‘స్కూటర్ల ప్రొడక్షన్ కెపాసిటీని రెట్టింపు చేయడానికి ఈ నిధులను ఉపయోగిస్తాం. ప్రస్తుతం నెలకు సుమారు 60 వేల స్కూటర్ల విక్రయాలు జరుగుతుండగా, దీనిని నెలకు 1 లక్షకు చేర్చాలని లక్ష్యంగా పెట్టుకున్నాం”అని సంస్థ సీఈఓ హర్షవర్ధన్ చితాలే అన్నారు.
హీరో స్కూటర్ల ఐసీఈ విభాగంలో 'డెస్టిని' మోడల్ ప్రొడక్షన్ కెపాసిటీని ఇప్పటికే 50శాతం పెంచగా, 'జూమ్' మోడల్ ఉత్పత్తిని రెట్టింపు చేసే పనిలో ఉంది. ఈవీల ఉత్పత్తి సామర్థ్యాన్ని గత క్వార్టర్ కంటే 50శాతం పెంచే ప్రక్రియ తుది దశకు చేరిందని హర్షవర్ధన్ చెప్పారు.
ఈవీ ఉత్పత్తిని 15 వేల యూనిట్ల నుంచి 25 వేల యూనిట్లకు పెంచామని, ఈ ఏడాది చివరికల్లా దీనిని మరింత రెట్టింపు చేస్తామని వెల్లడించారు. పార్ట్స్, యాక్సెసరీస్ బిజినెస్ను విస్తరించడంలో భాగంగా దక్షిణ భారతదేశంలో ఒక అంతర్జాతీయ విడిభాగాల కేంద్రాన్ని ఏర్పాటు చేయడానికి రూ.700 కోట్లకు పైగా పెట్టుబడి పెట్టనున్నట్లు ప్రకటించారు.
