
హైదరాబాద్, వెలుగు: ప్రముఖ దర్శకుడు రాంగోపాల్వర్మ రూపొందించిన 'వ్యూహం' సినిమా విడుదల నిలిచిపోయింది. 'వ్యూహం' సినిమా టీడీపీ చీఫ్ చంద్రబాబు కీర్తి ప్రతిష్టలకు భంగం కలిగించేలా ఉందని పేర్కొంటూ నారా లోకేశ్ దాఖలు చేసిన పిటిషన్ ను రాష్ట్ర హైకోర్టు గురువారం విచారించింది.
దాదాపు నాలుగు గంటలకు పైగా వాదనలు జరగగా.. రాత్రి 11:30 గంటల తర్వాత సినిమా విడుదలను నిలిపివేస్తూ జస్టిస్ సూరేపల్లి నంద మధ్యంతర ఆదేశాలు జారీ చేశారు. విచారణను జనవరి 11కు వాయిదా వేశారు. అప్పటివరకు సెన్సార్ బోర్డు జారీచేసిన సర్టిఫికెట్ సస్పెన్షన్ లో ఉంచుతున్నట్లు కోర్టు పేర్కొంది.