- నియంత్రించేందుకు నాలుగు వారాల్లో మార్గదర్శకాలు జారీ చేయండి
- ప్రభుత్వానికి హైకోర్టు ఆదేశం
హైదరాబాద్, వెలుగు: దేవాలయాలు, ఆస్పత్రులు, పాఠశాలలకు 100 మీటర్ల దూరంలో మాంసాహార విక్రయం, వినియోగాలను నిషేధిస్తూ ఓ విధానాన్ని రూపొందించాలని ప్రభుత్వానికి హైకోర్టు ఇటీవల ఆదేశాలు జారీ చేసింది. హైదరాబాద్ నాంపల్లిలో 720 చదరపు అడుగుల స్థలంలోని తమ వ్యాపార కార్యకలాపాల్లో జోక్యం చేసుకోకుండా అధికారులను ఆదేశించాలని కోరుతూ మహారాష్ట్రకు చెందిన ఐ.బిపిన్ రాందాస్ హైకోర్టులో పిటిషన్ వేశారు.
దీనిని జస్టిస్ బి.విజయ్సేన్ రెడ్డి ఇటీవల విచారణ చేపట్టారు. పిటిషనర్ తరఫు న్యాయవాది వాదనలు వినిపిస్తూ.. ఈ స్థలాన్ని లీజుకు తీసుకుని, జీహెచ్ఎంసీతో పాటు ఆహార భద్రత, ప్రమాణాల అథారిటీ నుంచీ లైసెన్స్ తీసుకున్నామని తెలిపారు. లైసెన్సు లేకుండా నాన్వెజ్ రెస్టారెంట్ నిర్వహిస్తున్నారన్న సమాచారం మేరకు నాంపల్లి పోలీసులు తమ కార్మికుడిని నిర్బంధంలోకి తీసుకున్నారని చెప్పారు. ఇదే భవనంలో మరో మాంసాహార హోటల్ నడుపుతున్నా పట్టించుకోలేదన్నారు. ప్రభుత్వ న్యాయవాది వాదనలు వినిపిస్తూ ఈ హోటల్కు 100 మీటర్ల దూరంలో హనుమాన్ ఆలయం ఉందన్నారు.
ఇక్కడ మాంసాహార విక్రయం వల్ల శాంతిభద్రతల సమస్య తలెత్తుతుందన్నారు. జీహెచ్ఎంసీ న్యాయవాది వాదనలు వినిపిస్తూ.. ప్రస్తుతం అక్కడ ఎన్ఆర్ఐ లైవ్ కిచెన్ పేరుతో కబాబ్ లు విక్రయిస్తున్నారన్నారు. మరో హోటల్కు కూడా నోటీసులు ఇచ్చామని, చట్టప్రకారం చర్యలు తీసుకుంటామన్నారు. వాదనలు విన్న న్యాయమూర్తి.. దేవాలయ పరిసరాల్లో మాంసాహార పదార్థాల విక్రయం, వినియోగం భక్తుల మనోభావాలను దెబ్బతీస్తుందన్నారు. దీనికి సంబంధించి ఓ విధానాన్ని 4 వారాల్లో తీసుకురావాలని ప్రభుత్వాన్ని ఆదేశించారు. పిటిషనర్ వ్యాపారానికి సంబంధించి యథాతథస్థితిని కొనసాగించాలని ఆదేశించారు.
