- దర్యాప్తును నిలిపివేస్తూ హైకోర్టు ఉత్తర్వులు
- తదుపరి విచారణ ఈనెల 23కు వాయిదా
హైదరాబాద్, వెలుగు: కాంగ్రెస్ వార్ రూంలో పని చేసే వారిపై పోలీసులు నమోదు చేసిన కేసు దర్యాప్తును నిలిపివేస్తూ హైకోర్టు స్టే ఉత్తర్వులు జారీ చేసింది. సీఆర్పీసీలోని 41ఏ సెక్షన్ కింద ఇచ్చిన నోటీసుల్ని కొట్టేయాలని కోరుతూ ముగ్గురు నిందితులు దాఖలు చేసిన రిట్ పిటిషన్పై హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ కె.సురేందర్ బుధవారం విచారించారు. కేసు దర్యాప్తును నిలిపివేస్తూ స్టే ఇచ్చారు. కాంగ్రెస్ వార్ రూంలో పనిచేస్తున్న హిమాచల్ప్రదేశ్ సిమ్లాకు చెందిన ఇషా న్ శర్మ, విశాఖ వాసి తాతినేని శశాంక్, విజయవాడకు చెందిన ఎం. శ్రీప్రతాప్లపై పోలీసులు ఇటీవల కేసు నమోదు చేసి, 41ఏ నోటీసులు జారీ చేశారు. పిటిషనర్ల తరఫున సీనియర్ న్యాయవాది సీవీ మోహన్రెడ్డి వాదిస్తూ.. పోలీసులు నోటీసులు ఇవ్వకుండానే సోదాలు చేయడం చట్ట వ్యతిరేకమన్నారు.
వార్ రూంలోని వస్తువుల్ని స్వాధీనం చేసుకున్నారని, పం చనామా చేసినట్లు డాక్యుమెంట్ కూడా ఇవ్వలేదన్నా రు. ఎఫ్ఐఆర్లోని ఆరోపణలు ఏవీ పిటిషనర్లకు వ ర్తించవన్నారు. 41ఏ నోటీసులో కారణాలు ఏమీ లేవన్నారు. ఎమ్మెల్యేల కొనుగోలు కేసు తరహాలోనే కారణాలు లేకుండా 41ఏ నోటీసు ఇచ్చారని తెలి పారు. మాయాబజార్లోని సన్నివేశం తరహాలో సోషల్ మీడియా పోస్టు పెట్టడం పరువు నష్టం ఏమీకాదన్నారు. పోలీసులు సోదా చేసిన తర్వాత పిటిషనర్లను18 గంటలపాటు అక్రమంగా నిర్బంధంలోకి తీసుకున్నారని, హెబియస్ కార్పస్ పిటిషన్ దాఖలు చేశాకే వాళ్లను అరెస్టు చేయలేదని పోలీసులు చెప్పారని తెలిపారు. పిటిషనర్లకు రూ.20 లక్షల చొప్పున పరిహారం ఇప్పించాలని కోరారు. పబ్లిక్ ప్రాసిక్యూటర్ సి.ప్రతాప్రెడ్డి వాదిస్తూ.. పిటిషనర్లను పోలీసులు అదుపులోకి తీసుకోలేదన్నారు. మాయాబజార్ సన్నివేశాన్ని స్కూప్ చేసి పలువురికి పరువు నష్టం కలిగించారని చెప్పారు. పిటిషనర్లు నిందితులుగా ఉన్నారని, కేసు దర్యాప్తును అడ్డుకోరాదని కోరారు. ఇరుపక్షాల వాదనల తర్వాత హైకోర్టు కేసు దర్యాప్తుపై, 41ఏ నోటీసుపైనా స్టే ఇచ్చింది. తదుపరి విచారణను 23కు వాయిదా వేసింది. ఈలోగా పోలీసులు కౌంటర్ దాఖలు చేయాలని ఆదేశించింది.