హైదరాబాద్, వెలుగు: ఎలిఎటేడ్ కారిడార్ నిర్మాణం కోసం సికింద్రాబాద్లోని వక్ఫ్ బోర్డుకు చెందిన నాలుగు ఎకరాల భూసేకరణపై యథాతథస్థితిని కొనసాగించాలని హైకోర్టు ఆదేశించింది. వక్ఫ్ బోర్డు భూమి సేకరణపై 2024 డిసెంబర్లో, గత జనవరి 3న ఇచ్చిన వినతిపత్రంపై ప్రభుత్వం చర్యలు తీసుకోవడంలేదంటూ మహమ్మద్ అబిద్ ఇతరులు వేసిన వ్యాజ్యాన్ని జస్టిస్ ఎన్. వి శ్రవణ్ కుమార్ ఇటీవల విచారించారు.
సికింద్రాబాద్లోని దర్గా సయ్యద్ సాహెబ్, ముస్లిం బోర్డుకు చెందిన శ్మశానం మొత్తం 8 ఎకరాలు ఉందని, అందులో నాలుగు ఎకరాలను జాతీయ రహదారి 44లోని ఎలివేటెడ్ కారిడార్ నిర్మాణం కోసం భూసేకరణ చేయరాదన్న తమ వినతులను అధికారులు పట్టించుకోవడం లేదని పిటిషనర్ న్యాయవాది వాదించారు.
ప్రతివాదులు కౌంటర్లు దాఖలు చేయాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలతోపాటు వక్ఫ్ బోర్డు, సికింద్రాబాద్ కంటోన్మెంట్ సీఈవోలకు నోటీసులు జారీ చేసిన హైకోర్టు విచారణను ఈ నెల 11కి వాయిదా వేసింది. అప్పటి వరకు భూసేకరణ ప్రక్రియపై యథాతథస్థితిని కొనసాగించాలని మధ్యంతర ఉత్తర్వుల్లో పేర్కొంది.
