న్యూఢిల్లీ: రిలయన్స్ క్యాపిటల్ (ఆర్క్యాప్) ను కొనుగోలు చేయడానికి హిందుజా గ్రూప్ తీవ్రంగా ప్రయత్నిస్తోంది. బిడ్స్ వేయడానికి డెడ్లైన్ కిందటి బుధవారంతో ముగిసింది. అయినప్పటికీ, హయ్యస్ట్ బిడ్డర్ కంటే రూ.760 కోట్లు ఎక్కువ అంటే రూ. 9,400 కోట్లు ఆఫర్ చేసి కొత్తగా ఈ కంపెనీ బిడ్ వేసిందని సంబంధిత వ్యక్తులు పేర్కొన్నారు. రూ. 8,640 కోట్లను ఆఫర్ చేసిన టోరెంటో ఇన్వెస్ట్మెంట్స్ తాజా బిడ్డింగ్ రేసులో ముందుంది. హిందుజా గ్రూప్ బిడ్ను అంగీకరించాలా? వద్దా? అనేది క్రెడిటార్లు ( రిలయన్స్ క్యాపిటల్కు అప్పులిచ్చిన వారు) నిర్ణయిస్తారు.
రూ.8,110 కోట్లతో ఫైనల్ బిడ్ వేసిన హిందుజా గ్రూప్, బిడ్డింగ్ ప్రాసెస్ నుంచి గురువారం వైదొలిగింది. బిడ్డర్లందరూ తమ బిడ్ అమౌంట్ను, అడ్వాన్స్గా ఎంత చెల్లిస్తాం, తర్వాత ఎంత చెల్లిస్తాం అనే వివరాలను కమిటీ ఆఫ్ క్రెడిటార్ల (సీఓసీ) కి సబ్మిట్ చేశాయి. హిందుజా గ్రూప్ రూ.8,800 కోట్లను అడ్వాన్స్గా (అప్ఫ్రంట్) చెల్లించేందుకు ముందుకొచ్చిందని సంబంధిత వ్యక్తులు వివరించారు.