
- అసాధ్యాన్ని సుసాధ్యం చేశామని వెల్లడి
హైదరాబాద్, వెలుగు : రైతులకు రుణ విముక్తి కల్పించి రాష్ట్ర ప్రభుత్వం చారిత్రాత్మక నిర్ణయం తీసుకుందని మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి అన్నారు. లక్ష రూపాయల రుణమాఫీ ఒకసారి మాఫీ చేయడం సాధ్యం కాదు, అసలు జరగదు అని ఆనాటి సీఎం కేసీఆర్ స్వయంగా అసెంబ్లీలో ప్రకటిస్తే, ఈనాటి సీఎం రేవంత్ రెడ్డి ఏకకాలంలో రెండు లక్షల రూపాయల రుణమాఫీ చేస్తూ విప్లవాత్మక నిర్ణయం తీసుకున్నారన్నారు. అసాధ్యాన్ని సుసాధ్యం చేశారని బుధవారం విడుదల చేసిన ఒక ప్రకటనలో తెలిపారు. గత ప్రభుత్వ నిర్వాకం వల్ల రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ ఛిన్నాభిన్నం అయిందని..
ఏకకాలంలో రెండు లక్షల రూపాయల రుణమాఫీకి ఆర్థిక పరిస్థితి ఏ మాత్రం సహకరించపోయినా కూడా రాష్ట్ర రైతాంగానికి ఇచ్చిన మాటను నిలబెట్టుకున్నామన్నారు. జులై 18వ తేదీ లక్ష రూపాయల వరకు రుణమాఫీ చేస్తున్నామని ఆ రోజు సాయంత్రం వరకు రైతు రుణ ఖాతాలో డబ్బులు జమ చేస్తున్నామన్నారు. 16 ఏండ్ల కింద కేంద్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వం రైతాంగానికి సంబంధించి రూ.72 వేల కోట్ల రూపాయల వ్యవసాయ రుణాలు, వడ్డీలను మాఫీ చేసిందని గుర్తు చేశారు. తెలంగాణలో వ్యవసాయం మరింత లాభసాటిగా మారాలని..
అంతిమంగా రైతు సోదరులు ఆర్థికంగా బలపడడానికి రైతాంగానికి ఎల్లవేళలా ఈ ప్రభుత్వం అండగా ఉంటుందన్నారు. రాష్ట్రంలో వ్యవసాయం దండుగా కాదు పండుగ అనే విధంగా పరిస్థితిని మారుస్తున్నామని రైతన్న కష్టాలు తేరిపోవాలని నడుంబిగించామన్నారు. రాబోయే కాలంలో ప్రభుత్వం రైతులకు మరింత అండగా నిలుస్తుందని.. రైతును రాజు చేయాలన్నది ప్రభుత్వ అంతిమ లక్ష్యమన్నారు.