ఈ ఫొటో చూడంగనే గోల్ కీపర్ అనే విషయం తెలుస్తోంది కదా. మీ గెస్ కరెక్టే. ఈ గోల్ కీపర్ పేరు ఎతిమరపు రజని. ఇండియన్ హాకీ టీంలో ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తున్న ఈమెది ఆంధ్రప్రదేశ్లోని చిత్తూరు జిల్లా. మారుమూల గ్రామంలో పుట్టి దేశం మొత్తం గర్వించేంత ఎత్తుకు ఎదిగిన రజని గురించి...
తిరుపతి నుంచి 45 కిలోమీటర్ల దూరంలో ఉన్న యనమలవారిపల్లి రజని సొంతూరు. ఏడో తరగతి వరకు ఆ ఊళ్లోనే చదువుకుంది. ఎనిమిదో తరగతికి జెడ్పిహెచ్ స్కూల్లో జాయిన్ అయింది. అప్పటికి తనకి స్పోర్ట్స్ గురించి అవగాహన లేదు. తండ్రి రమణాచారి కార్పెంటర్, తల్లి తులసి కూడా రజనిని స్పోర్ట్స్కి పంపడానికి ఒప్పుకోలేదు. అందుకు కారణం డబ్బు సరిపోకపోవడమే.
వాళ్ల స్కూల్ పీఈటీ నెరబైలు వెంకటరాజా స్పోర్ట్స్లో స్టూడెంట్స్ని బాగా ఎంకరేజ్ చేసేవారు. రజని వాలీబాల్ ఆడుతుండేది. ఆ టైంలో జోనల్ హాకీ టోర్నమెంట్ కోసం వాళ్ల టీం గోల్ కీపర్ కోసం చూస్తున్నారు. రజని ఎత్తు చూసి తనైతే బాగా ఆడగలదని టీంకి సెలక్ట్ చేసుకున్నారు. చదువుకుంటూనే స్పోర్ట్స్లో పార్టిసిపేట్ చేయొచ్చు. పైగా స్పోర్ట్స్ కోటాలో జాబ్స్ కూడా వస్తాయనడంతో ముందడుగేసింది రజని. ఏపి ఉమెన్స్ హాకీ అసోసియేషన్ సెక్రెటరీ ప్రసన్న కుమార్ రెడ్డి, పీఈటీలు రజని అమ్మానాన్నల్ని ఒప్పించారు. తిరుపతిలో ఉన్న ఏపి రీజనల్ హాకీ అకాడమీలో చేరింది. తర్వాత హైదరాబాద్ వచ్చి ఎస్ఏఐ హాస్టల్లో చేరింది. ఆ తర్వాత ఇండియన్ టీంకి సెలక్ట్ అయింది.
ఇండియా టీంలో 2009 నుంచి ఆడుతోంది. 2013లో జపాన్లో జరిగిన ఏషియన్ ఛాంపియన్షిప్లో ఇండియన్ హాకీ టీం కప్పు సాధించింది. ఆ ఆటలో కీలకపాత్ర వహించింది గోల్కీపర్ రజని. 2016లో ఏషియన్ ఛాంపియన్ ట్రోఫీ గెలుచుకుంది. 2017 నవంబర్ 5న చైనాతో జరిగిన చివరి ఆటలో హాకీ విమెన్స్ టీం గెలిచింది. దాదాపు13 ఏళ్లకు ఈ విజయం వరించింది. అందుకు కారణం గోల్కీపర్ రజని. ఆమె హైట్ ఆమెకి ఎంతో ప్లస్ అని ఎందరో మెచ్చుకున్నారు. ఉత్తమ గోల్కీపర్గా అవార్డు కూడా అందుకుందామె. తన ప్రతిభకు గుర్తింపుగా అప్పటి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తనకి ‘సాప్’లో సభ్యత్వం ఇచ్చింది. ఫస్ట్ టోర్నమెంట్ 2009లో న్యూజిలాండ్లో ఆడింది. తర్వాత ఏషియన్ ఛాంపియన్షిప్ ట్రోఫీ, కామన్వెల్త్ గేమ్స్, ఏషియన్ కప్, సమ్మర్ గేమ్స్లో పాల్గొన్నది. 2014లో గాయం వల్ల బ్రేక్ తీసుకుని, 2015లో మళ్లీ వచ్చింది. టోక్యోలో జరుగుతున్న 2020 ఒలింపిక్స్ ఇండియన్ విమెన్ హాకీ టీంలో ఆడి ఒలింపియన్ అనిపించుకుంది ఈ తెలుగమ్మాయి.
‘‘విలేజ్లో ఉండే పిల్లలకు స్పోర్ట్స్ గురించి చెప్పాలి. అకాడమీలు ఉండడం వల్ల చాలామంది అమ్మాయిలు ముందుకొస్తున్నారు. పిల్లలకు కావాల్సిన ఎంకరేజ్మెంట్ ఇస్తే ఏ రంగంలోనైనా రాణించగలరు” అంటోంది రజని.