
జీడిమెట్ల, వెలుగు: అతడు ఒకప్పుడు హోంగార్డు. వివాహేతర సంబంధం, మద్యం వంటి చెడు అలవాట్లకు బానిసయ్యాడు. తన ప్రియురాలి కళ్లలో ఆనందం కోసం చైన్స్నాచర్గా మారాడు. ఏకంగా 36 చైన్ స్నాచింగ్ కేసులు నమోదైనా అతని తీరు మారలేదు. ఇటీవల దొంగతనాలు చేయడంతో బాలానగర్ ఎస్వోటీ, బాచుపల్లి పోలీసులు అతన్ని అరెస్ట్ చేశారు.
బాలానగర్ డీపీసీ సురేశ్ కుమార్ తెలిపిన వివరాల ప్రకారం.. రాజస్థాన్కు చెందిన మహేందర్ సింగ్ సైబరాబాద్కమిషనరేట్లో హోంగార్డుగా పనిచేసేవాడు. అతనికి ఓ మహిళతో వివాహేతర సంబంధం ఏర్పడింది. మద్యానికి బానిసయ్యాడు. మద్యం తాగడానికి డబ్బులు సరిపోకపోవడంతో దొంగగా మారాడు. 2012 నుంచి 2015 వరకు బాలానగర్, జీడిమెట్ల, సనత్నగర్, కూకట్పల్లి, కేపీహెచ్బీ తదితర ప్రాంతాల్లో అతనిపై 36 స్నాచింగ్ కేసులు నమోదయ్యాయి.
పీడీ యాక్ట్ సైతం నమోదు చేశారు. అయినా తీరు మారలేదు. గత నెల 24న బాచుపల్లిలో వాకింగ్ చేస్తున్న మహిళ మెడలోంచి బంగారు గొలుసు దొంగిలించాడు. అనంతరం జీడిమెట్ల, జగద్గిరిగుట్టలో మరో ఇద్దరు మహిళల బంగారు గొలుసు దొంగలించాడు. దీంతో పోలీసులు అతన్ని సోమవారం అరెస్టు చేశారు. అతని వద్ద రూ.5 లక్షల విలువ చేసే బంగారం, బైక్ స్వాధీనం చేసుకున్నారు.