నగరంలో మరో పరువు హత్య కేసు కలకలం సృష్టించింది. తన కూతురుని ప్రేమించి పెళ్లి చేసుకున్నాడన్న కోపంతో.. యువతి తల్లిదండ్రులు, బంధువులు యువకుడిని దారుణంగా హత్య చేశారు. ఈ ఘటన మిర్యాలగూడెం ప్రణయ్ హత్య కేసును గుర్తుచేస్తోంది.
గచ్చిబౌలిలో నివాసముంటున్న హేమంత్ అనే యువకుడు చందానగర్ ప్రాంతానికి చెందిన యువతిని కొన్ని రోజుల క్రితం ప్రేమించి పెళ్ళి చేసుకున్నాడు. ఈ యువ జంట పెళ్లి తర్వాత చందానగర్ నుంచి వచ్చి గచ్చిబౌలిలోని టీఎన్జీఓ కాలనీలో నివాసం ఉంటున్నారు. ప్రేమ వివాహాన్ని ఇష్టపడని యువతి తండ్రి లక్ష్మారెడ్డి.. ఎలాగైనా హేమంత్ని అంతమొందించాలని అనుకున్నాడు. అందులోభాగంగా అవంతి, హేమంత్లను నమ్మించి కిడ్నాప్ చేసి సంగారెడ్డిలో ఉరి వేసి హత్య చేశారు. అవంతి, హేమంత్లను యువతి బంధువులు నిన్న గచ్చిబౌలిలో ఇంటికి తీసుకెళ్తామని చెప్పి బలవంతంగా కారులోకి ఎక్కించుకున్నారు. అయితే కారులో నుంచి దూకి వారి నుంచి తప్పించుకున్న అవంతి.. పారిపోయి కిడ్నాప్ గురించి 100కి సమాచారం ఇచ్చింది. అయినా కూడా గచ్చిబౌలి పోలీసులు సకాలంలో స్పందించలేదని తెలుస్తోంది. పోలీసులు ఆలస్యం చేయడంతో సుపారీ గ్యాంగ్ హేమంత్ని సంగారెడ్డి తీసుకువెళ్లి హత్యచేశారు. అయితే పోలీసులు మాత్రం రాత్రి అవంతి తండ్రిని విచారించారు. ఆయన ఇచ్చిన సమాచారంతో సంగారెడ్డిలోని కిష్టాయగూడెం శివారులో హేమంత్ మృతదేహాన్ని గుర్తించారు. అక్కడినుంచి హేమంత్ మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు. ఈ కేసుకు సంబంధించి గచ్చిబౌలిలో కిడ్నాప్ కేసు, చందానగర్లో మిస్సింగ్ కేసు, సంగారెడ్డిలో హత్య కేసు నమోదయ్యాయి.
For More News..