పద్మారావునగర్, వెలుగు: తమకు రావాల్సిన కోట్లాది రూపాయల బకాయిలను వెంటనే విడుదల చేయాలని రాష్ట్ర ప్రభుత్వ ఆసుపత్రులకు సర్జికల్, డయాగ్నోస్టిక్ సామగ్రి సరఫరా చేస్తున్న ట్విన్ సిటీస్ హాస్పిటల్స్ సప్లయర్స్ అసోసియేషన్ (టీసీహెచ్ఎస్ఏ)కోరింది. ఈ మేరకు ఆరోగ్య శాఖ మంత్రి దమోదరకు లెటర్ రాసింది.
సర్జికల్స్, డ్రగ్స్ కొనుగోళ్ల కోసం నెలకు అదనంగా రూ.50 కోట్లు పెంచి మొత్తం రూ.100 కోట్లు కేటాయించాలని నిర్ణయించినప్పటికీ, మే నెలలో టీజీఎంఎస్ఐడీసీ కేవలం మందులు, ఆక్సిజన్ కోసం మాత్రమే రూ.50 కోట్లు విడుదల చేసిందని సంఘం ప్రతినిధులు తెలిపారు.2022 నుంచే సర్జికల్, డయాగ్నోస్టిక్ బిల్లుల చెల్లింపులు నిలిచిపోయాయని, 2024–25, 2025–26 సంవత్సరాలకు సంబంధించిన ఎనిమిది క్వార్టర్ల బడ్జెట్కు బదులుగా కేవలం మూడు క్వార్టర్ల నిధులే విడుదలయ్యాయన్నారు. టీజీఎంఎస్ఐడీసీలో రూ.128 కోట్ల బకాయిలు పెండింగ్లో ఉన్నాయని వెల్లడించారు. వాటివిడుదలకు చర్యలు తీసుకోవాలని కోరారు.
