డబ్బులు లేవంటూ సెక్రటేరియట్ ఎలా కడుతున్నారు: మంద కృష్ణ

డబ్బులు లేవంటూ సెక్రటేరియట్ ఎలా కడుతున్నారు: మంద కృష్ణ

ఎమ్మార్పీఎస్ అధ్యక్షుడు మంద కృష్ణ  సీఎం కేసీఆర్ పై ఆగ్రహం వ్యక్తం చేశారు. దళితులకు మూడు ఎకరాల భూమి ఇస్తానన్న కేసీఆర్ ఇప్పుడు డబ్బుల్లేవంటున్నారని, డబ్బు లేకుండా కొత్త సెక్రటేరియట్ ఎలా కడుతున్నారని ప్రశ్నించారు. రాష్ట్ర ఏర్పాటు ఉద్యయంలో దళితులు, బహుజనులే త్యాగం చేశారని, కానీ దొరల రాజ్యంలో దళితుల బతుకులు ఆగమయ్యాయన్నారు. మంద కృష్ణ  ఇవాళ(మంగళవారం) రాజన్న సిరిసిల్ల జిల్లాలో పర్యటించారు. మా భూములు మాకు కావాలి పేరుతో ఎమ్మార్పీఎస్ కార్యకర్తలు నిర్వహించిన దీక్ష శిబిరాన్ని ఆయన సందర్శించారు. ఈ సందర్భంగా మాట్లాడారు. అభివృద్ధి కార్యక్రమాల పేరుతో దళితుల భూములు లాగేసుకుంటున్నారని, శ్మశానవాటికలు, ప్రకృతి వనాలు, రైతు వేదికలు అంటూ భూములు లాక్కుంటుంటే తట్టుకోలేక దళితులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారని ఆరోపించారు. గట్టిగా ప్రశ్నించినవారిపై పీడీ యాక్ట్ లు, కేసులు నమోదు చేస్తున్నారన్నారు.

అంతేకాదు… వచ్చే ఎన్నికల్లో టీఆర్ఎస్ ఓటమి ఖాయమని, మహాజన సోషలిస్ట్ పార్టీ అధికారంలోకి వస్తుందన్నారు మందకృష్ణ. తాము అధికారం చేపట్టాక దళితులకు మూడు ఎకరాల భూమి ఇస్తామని లేదా.. ఎకరాకు రూ.10 లక్షల చొప్పున రూ.30 లక్షలు వారి అకౌంట్లో వేస్తామని హామీ ఇచ్చారు.