లక్షల కోట్ల అప్పుతో బంగారు తెలంగాణ ఎట్ల:వివేక్

లక్షల కోట్ల అప్పుతో బంగారు తెలంగాణ ఎట్ల:వివేక్

సీఎం కేసీఆర్ పచ్చి అబద్ధాలకోరని, ప్రజలను మోసం చేసి ఆస్తులు పెంచుకోవడం, అక్రమ సంపాదన కూడబెట్టుకోవడం తప్ప ఆయన ప్రజలకు చేసిందేమీ లేదని మాజీ ఎంపీ, బీజేపీ రాష్ట్ర కోర్ కమిటీ సభ్యుడు వివేక్ వెంకటస్వామి ఫైర్ అయ్యారు. రాష్ట్రాన్ని అప్పులపాలు చేసి కేసీఆర్ కుటుంబమే బాగుపడిందన్నారు. రాష్ట్రంలోని ప్రతి ఒక్కరిపై రూ.50 వేల అప్పు చేసిన ఘనత కేసీఆర్ కే దక్కిందని ఎద్దేవా చేశారు. రాష్ట్రం పేరు మీద రూ.3.60 లక్షల కోట్లు అప్పు చేసిన కేసీఆర్…  ఇక బంగారు తెలంగాణగా ఎలా మారుస్తారని ప్రశ్నించారు. ఆంధ్రా వాళ్లకు సాగునీటి ప్రాజెక్టుల కాంట్రాక్టులు ఇచ్చి రాష్ట్రాన్ని దోచుకుతింటున్నారని మండిపడ్డారు. రైతుబంధు, పెన్షన్లు వస్తున్నాయని రైతులు, వృద్ధులు, ఇతర వర్గా లవారు నమ్మి కేసీఆర్ ను బలపరచవద్దని విజ్ఞప్తి చేశారు. కేసీఆర్ చేసిన మోసాలకు చెంపదెబ్బ కొట్టేందుకు ఆయనను గద్దె దించాలని కోరారు. బీజేపీని బలపరిచి రాబోయే ఎన్నికల్లో గెలిపిస్తే .. మోడీ పాలనను ఇక్కడ చూస్తారని చెప్పా రు. గ్రామ స్థాయిలో హెల్త్ సెంటర్లకు తాళాలు వేసి ఉంటున్నాయని, ట్రీట్ మెంట్ కోసం పేదలు ఎక్కడికి వెళ్లాలని ఆయన ప్రశ్నించారు. కరోనా టైంలో హెల్త్ సెంటర్లు పనిచేయకపోవడం కేసీఆర్ మార్క్ పాలనా? అని వివేక్ ఎద్దేవా చేశారు.