ఎన్నెన్నో సైనిక రహస్యాలు, ఆయుధాల టెక్నాలజీ, శత్రు దేశాలపై నిఘా, అధికారుల మధ్య జరిగే సీక్రెట్ సంభాషణలు.. ఒక్కటేమిటి, మిలటరీకి సంబంధించి ఎన్నెన్నో రహస్యాలను అమెరికా వినేస్తోంది. గుట్టుగా స్పై చేసేస్తోంది. ఒకటి కాదు, రెండు కాదు.. 50 ఏళ్ల నుంచి ఈ తంతు నడుస్తోంది. పైగా పైసలిచ్చి మరీ మనం స్పై చేయించుకుంటున్నామంటే అతిశయోక్తి కాదు. ఇండియా సహా 62 దేశాలపై అమెరికాతో పాటు, జర్మనీ నిఘా వేశాయి. ఆయా దేశాల గుట్టులన్నింటినీ గంపగుత్తగా దోచేశాయి. ‘21వ శతాబ్దపు అతిపెద్ద గూఢచర్యం’గా పిలుస్తున్న ఆ సీక్రెట్ ఆపరేషన్ వివరాలు వాషింగ్టన్పోస్ట్, జెడ్డీఎఫ్ అనే జర్మనీకి చెందిన మీడియా సంస్థలు కలిసి చేసిన ఆపరేషన్లో బయటపడ్డాయి.
కోడ్నేమ్ థెసారస్
క్రిప్టో ఏజీ.. స్విట్జర్లాండ్కు చెందిన రహస్యాలను కోడ్రూపంలో మార్చి చెప్పే మెషీన్లను తయారు చేసే కంపెనీ. మెకానికల్ గేర్స్, ఎలక్ట్రానిక్ సర్క్యూట్స్, సిలికాన్ చిప్స్, సాఫ్ట్వేర్లను తయారు చేస్తుంటుంది. ఆ కంపెనీకి 120 దేశాలు కస్టమర్లు. కానీ, ఆ కంపెనీలో అమెరికాకు చెందిన గూఢచర్య సంస్థ సెంట్రల్ ఇంటెలిజెన్స్ ఏజెన్సీ (సీఐఏ), జర్మనీ ఇంటెలిజెన్స్ ఏజెన్సీ బీఎన్డీలకు వాటాలున్నాయన్న సంగతి చాలా దేశాలకు తెలిసుండదు. అన్ని దేశాలు ఆ సంస్థ నుంచి కొన్ని కోట్ల రూపాయలు పెట్టి ఎన్క్రిప్షన్ డివైస్లను కొన్నాయి. కానీ, ఆ వ్యాపారం వెనక గుట్టుగా ఓ ఆపరేషన్ను మొదలుపెట్టాయి సీఐఏ, బీఎన్డీ. థెసారస్ పేరిట సాగించిన ఆ ఆపరేషన్లో 62 దేశాల సైనిక రహస్యాలను తెలుసుకున్నాయి. తర్వాత ఆ కోడ్నేమ్ను ‘రుబికాన్’గా మార్చేశాయి. దీంతో అటు పైసలకు పైసలతో పాటు, ఇటు దేశాల రహస్యాలన్నింటినీ అప్పణంగా కొట్టేశాయి. మన దాయాది పాకిస్థాన్, పక్క దేశం బంగ్లాదేశ్, బ్రిటన్, ఇరాన్, టర్కీ, ఫ్రాన్స్ వంటి దేశాలకు సంబంధించిన అతి విలువైన సమాచారాన్ని దోచేశాయి.
చైనా, రష్యాలు కొన్లే
అమెరికాకు సవాల్ విసిరే దేశాలు చైనా, రష్యా. కానీ, ఆ రెండు దేశాలు క్రిప్టో ఏజీకి సంబంధించిన పరికరాలను కొనలేదు. వాటిని వాడలేదు. అయినా ఆయా దేశాలకు చెందిన కొన్ని సీక్రెట్లనూ ఛేదించాయి సీఐఏ, బీఎన్డీ. ఇక్కడ అదెలా సాధ్యమన్న ప్రశ్న తలెత్తొచ్చు. ఇండియా లాంటి దేశాలు ఆయుధాలకు సంబంధించి రష్యాతో ఒప్పందం చేసుకుంటున్న సంగతి తెలిసిందే. ఆ టైంలో రష్యాతో మాట్లాడే సీక్రెట్లన్నింటినీ అమెరికా కాపీ కొట్టేసింది. చైనా విషయంలోనూ అదే జరిగింది.
1990లో బీఎన్డీ.. 2018లో సీఐఏ
ఈ ఆపరేషన్కు సంబంధించిన వ్యవహారాలపై 1970లో తొలిసారిగా డాక్యుమెంట్లు రిలీజ్ అయ్యాయి. దాంతో క్రిప్టో ఏజీ ఓనర్కు, అమెరికా నేషనల్ సెక్యూరిటీ ఏజెన్సీకి మధ్య విభేదాలొచ్చాయి. అది కాస్తా ముదరడం, 1990నాటికి అది మరింత ఎక్కువ కావడంతో 1990లో బీఎన్డీ కంపెనీ నుంచి బయటకొచ్చేసింది. బీఎన్డీ అమ్మిన వాటాను సీఐఏ కొనేసింది. అప్పటి నుంచి సీఐఏ హోల్ అండ్ సోల్గా వివిధ దేశాలపై గూఢచర్యం చేసింది. అయితే, 2018లో కంపెనీ నుంచి సీఐఏ కూడా బయటకొచ్చేసింది. అయితే, సీఐఏ, బీఎన్డీ మధ్య ఆపరేషన్కు సంబంధించి విభేదాలొచ్చినట్టు మాత్రం జర్మనీ ఇంటెలిజెన్స్ అధికారుల ద్వారా తెలుస్తోంది. డబ్బు, కంట్రోల్, పవర్, ఎథికల్ లిమిట్స్కు సంబంధించి సీఐఏతో బీఎన్డీకి గొడవలొచ్చినట్టు సమాచారం.
విచారణకు ఆదేశించిన స్విట్జర్లాండ్
ఈ రిపోర్టుపై ఇటు సీఐఏ గానీ, అటు బీఎన్డీ గానీ పెదవి విప్పలేదు. అలాగని సంబంధం లేదని కూడా చెప్పలేదు. ఈ తతంగమంతా పెద్ద దుమారాన్నే రేపడంతో మంగళవారం విచారణకు ఆదేశించింది స్విట్జర్లాండ్ ప్రభుత్వం. ఇప్పటికే క్రిప్టోకు సంబంధించిన ఎక్స్పోర్ట్ లైసెన్స్ను ఆ దేశ ప్రభుత్వం రద్దు చేసింది. అయితే, బయటకు విడుదలైన సీఐఏ, బీఎన్డీ డాక్యుమెంట్ల ద్వారా ఈ స్పైయింగ్ తతంగం గురించి స్విట్జర్లాండ్ అధికారులకూ తెలిసే ఉంటుందన్నది నిపుణులు చెబుతున్న మాట.
కొడుకుకు ఇద్దామనుకుంటే…
నిజానికి 1960ల నాటికే హేగిలిన్కు 80 ఏళ్లు వచ్చేశాయి. దీంతో కంపెనీ బాధ్యతలను తన కొడుకు బో హేగిలిన్కు ఇవ్వాలనుకున్నాడు. కానీ, అందుకు అమెరికా ఒప్పుకోలేదు. 1970లో వాషింగ్టన్లోని బెల్ట్వేలో బో యాక్సిడెంట్లో చనిపోయాడు. దీంతో సీఐఏకి ఉన్న అడ్డు తొలగిపోయింది. అయితే, 1967లో కంపెనీని కొనేందుకు ఫ్రెంచ్ ఇంటెలిజెన్స్ సర్వీస్ ఆఫర్ ఇచ్చింది. కానీ, అందుకు ఒప్పుకోని హేగిలిన్, ఆ విషయాన్ని సీఐఏకి చేరవేశాడు. ఆ తర్వాత రెండేళ్లకే సీఐఏ అండదండలతో బీఎన్డీ వాటా కొనేసింది.
1992లో తొలి దెబ్బ
ఏ, బీ, జీ కోడ్నేమ్లతో వివిధ దేశాలపై స్పైయింగ్కు సీఐఏ పూనుకుంది. ఏ అంటే సోవియట్, బీ అంటే ఆసియా, జీ అంటే మిగతా మొత్తం ప్రపంచం అని అర్థం. క్రిప్టో ఏజీకి తొలిసారిగా 1992ల పెద్ద దెబ్బ తగిలింది. లిబియా మీద ఉన్న అనుమానంతో క్రిప్టో సేల్స్మ్యాన్ హాన్స్ బ్యూలర్ను ఇరాన్ అరెస్ట్ చేసింది. అయితే, అతడిని 1986 నుంచే ఇరాన్ విచారించడం మొదలుపెట్టినా, అతడు తనకు ఏమీ తెలియదని చెప్పాడు. తర్వాత ఆరేళ్లకు అతడు స్విట్జర్లాండ్ వెళ్లబోతుండగా, విమానంలోనే అదుపులోకి తీసుకుంది. అయితే, పది లక్షల డాలర్లు ఇస్తామని క్రిప్టో ఒప్పందం చేసుకోవడంతో తొమ్మిది నెలల తర్వాత బ్యూలర్ను ఇరాన్ విడిచిపెట్టింది. అయితే, అప్పటిదాకా కంపెనీతో సీఐఏకి, బీఎన్డీకి సంబంధముందని తెలియని అతడు, ఇరాన్ తనను అరెస్ట్ చేసి విచారించే సరికి అతడికీ అనుమానం మొదలైంది. దానిపై స్విట్జర్లాండ్లోని మీడియా సంస్థలకు తాను ఎదుర్కొన్న పరిస్థితులను వివరించాడు. అక్కడి నుంచి సీఐఏ, బీఎన్డీకి పెద్ద దెబ్బే తగిలింది.
వేరే కంపెనీలు కొనేసినయ్
2018లో సీఐఏ తన వాటాలను అమ్మేసిన తర్వాత క్రిప్టో ఏజీనీ వేరే సంస్థలు కొనేశాయి. అందులో ఒకటి సైవన్ సెక్యూరిటీ అనే సంస్థ. స్విట్జర్లాండ్ ప్రభుత్వానికి సెక్యూరిటీ సిస్టమ్లను ఆ సంస్థ అమ్ముతోందిప్పుడు. రెండోది క్రిప్టో ఇంటర్నేషనల్. ఇంతకుముందు క్రిప్టో ఏజీ బిజినెస్నే ఈ కంపెనీ చూస్తోంది. విదేశాలకు ఆ ప్రొడక్ట్లను ఎగుమతి చేస్తోంది. అయితే, సీఐఏ, బీఎన్డీతో క్రిప్టో ఏజీకి సంబంధాలున్నాయన్న విషయం తెలియదంటున్నాయి ఆ కంపెనీలు.