ఆ వార్తలు పూర్తిగా అవాస్తవం.. ఏమాత్రం నిజం లేదు.. ఖండిస్తున్నాం : సజ్జనార్

ఆ వార్తలు పూర్తిగా అవాస్తవం.. ఏమాత్రం నిజం లేదు.. ఖండిస్తున్నాం : సజ్జనార్

వికారాబాద్‌ జిల్లా తాండూరు డిపోలో శ్రామిక్‌గా పనిచేస్తోన్న టి.రాజప్ప ఆత్మహత్యపై వస్తోన్న వార్తలు పూర్తి అవాస్తవమని ఆర్టీసీ ఎండీ సజ్జనార్ తెలిపారు. ఆర్టీసీ అధికారులు వేధించడం వల్లే ఆయన ఆత్మహత్య చేసుకున్నారనడంలో ఏమాత్రం నిజం లేదన్నారు. ఎక్స్ వేదికగా ఆయన ఈ అంశంపై స్పందించారు. ఈ నిరాధారమైన వార్తలను టీఎస్‌ఆర్టీసీ యాజమాన్యం ఖండిస్తోందని తెలిపారు. 

2013లో డ్రైవర్‌గా ఆర్టీసీలో చేరిన రాజప్ప.. ఆరోగ్య సమస్యల కారణంగా అన్‌ఫిట్‌ అయ్యారని 2018 నుంచి శ్రామిక్‌ గా డిపోలో పనిచేస్తున్నారని తెలిపారు. గత నెలలో అధికారులకు ఎలాంటి సమాచారం ఇవ్వకుండానే రాజప్ప 12 రోజులు విధులకు గైర్హాజరయ్యారని అయినా ఆయనకు డ్యూటీని కేటాయించడం జరిగిందని చెప్పారు. గత మూడు రోజులు నుంచి కూడా విధులకు హాజరుకావడం లేదని తెలిపారు. 

వికారాబాద్‌ జిల్లా యాలాల మండలంలోని తన స్వగ్రామం దౌలపూర్‌లో సోమవారం రాత్రి రాజప్ప ఆత్మహత్య చేసుకున్నారని తెలిసిందని అన్నారు. ఆయన ఆత్మహత్య చేసుకోవడం బాధాకరమన్నారు. రాజప్ప మృతికి సంస్థ తీవ్ర సంతాపాన్ని వ్యక్తం చేస్తోందని వెల్లడించారు. రాజప్ప ఆత్మహత్యకు వ్యక్తిగత కారణాలే కారణమని తెలుస్తోందని కుటుంబ సమస్యల వల్ల ఆత్మహత్య చేసుకుంటే దానికి సంస్థ అధికారులు బాధ్యులని ఆరోపించడం సరైంది కాదని సూచించారు. 

ఈ ఘటనపై స్థానిక పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేస్తున్నారని ఆర్టీసీ అధికారులు వేధించడం వల్లే ఆత్మహత్య చేసుకున్నారని వస్తోన్న వార్తలు పూర్తిగా నిరాధారమైనవి, అవాస్తవమైనవని సజ్జనార్ తెలిపారు.