టెన్త్ సిలబస్ పూర్తి చేసుడెట్ల?

టెన్త్ సిలబస్ పూర్తి చేసుడెట్ల?
  • జనవరి 10లోపే కంప్లీట్ చేయాలన్న సర్కార్
  • సాధ్యం కాదంటున్న హెడ్మాస్టర్లు, టీచర్లు 
  • 90 రోజుల్లో 100 శాతం సిలబస్ ఎట్లయితదని ప్రశ్న  
  • 70 శాతానికి తగ్గించాలని విజ్ఞప్తి

హైదరాబాద్, వెలుగు: రాష్ట్ర సర్కార్ అనాలోచిత నిర్ణయాలతో అటు టీచర్లు, ఇటు టెన్త్ స్టూడెంట్లు అవస్థలు పడుతున్నారు. దాదాపు ఏడాదిన్నర పాటు బడులకు దూరమైన పిల్లలు... ఇప్పుడిప్పుడే బడి బాట పడుతున్నారు. ఈ క్రమంలో మొత్తం సిలబస్​చెప్పాల్సిందేనని విద్యాశాఖ ఇచ్చిన ఆదేశాలతో అందరూ ఆందోళన చెందుతున్నారు. ఈ ఏడాది ఇప్పటికే కొన్ని రోజులు ఆన్​లైన్ క్లాసులు కొనసాగినప్పటికీ, బడుల ప్రారంభంతో టెన్త్ స్టూడెంట్లకు మళ్లీ మొదటి నుంచి పాఠాలు చెప్తున్నారు. ఇలాంటి టైమ్ లో 100 శాతం సిలబస్.. సర్కార్ ఇచ్చిన 90 రోజుల గడువులోగా ఎలా పూర్తవుతుందని హెడ్మాస్టర్లు, టీచర్లు ప్రశ్నిస్తున్నారు. 

నైన్త్ పాఠాలు టచ్ చేస్తూ...  

ప్రతి ఏటా జూన్​లో ప్రారంభమయ్యే అకడమిక్ ఇయర్.. ఈసారి కరోనాతో జులై ఫస్ట్ నుంచి ఆన్​లైన్ పాఠాలతో మొదలైంది. సెప్టెంబర్ ఫస్ట్ నుంచి బడులు ప్రారంభమయ్యాయి. అయితే జనవరి10లోగా టెన్త్ సిలబస్ పూర్తి చేయాలని విద్యాశాఖ ఆదేశాలిచ్చింది. జులై, ఆగస్టులో 47 రోజుల పాటు ఆన్​లైన్ క్లాసులు జరిగాయని, మిగిలిన 90 రోజుల్లో సిలబస్ మొత్తం పూర్తి చేయాలని చెప్పింది. కరోనా వల్ల 2019–20 అకడమిక్ ఇయర్ మార్చిలో బడులు బంద్ అయ్యాయి. 2020–21లో 21 రోజులే ఫిజికల్ క్లాసులు నడిచాయి. ప్రస్తుతం టెన్త్ లో ఉన్నోళ్లందరూ నైన్త్ మొత్తం ఆన్ లైన్ లోనే చదివారు. 9వ తరగతి పాఠాల ఆధారంగానే టెన్త్ పాఠాలు చెప్పాల్సి ఉంటుందని, దీంతో ఆ పాఠాలను టచ్ చేస్తూ సిలబస్ చెప్పాల్సి వస్తోందని టీచర్లు అంటున్నారు.

పోయినేడు 70 శాతమే సిలబస్.. 

2020–21లో కొన్ని రోజులే ఫిజికల్ క్లాసులు నడిచాయి. దీంతో టెన్త్ ఎగ్జామ్స్​లో 70 శాతం సిలబస్​నే పరిగణనలోకి తీసుకుంటామని విద్యాశాఖ చెప్పింది. కానీ ఈసారి 100 శాతం పాఠాలు చెప్పాలని ఆదేశించింది. కాగా, జులై, ఆగస్టులో జరిగిన ఆన్​లైన్ క్లాసులను దాదాపు ఏ స్కూల్​లోనూ పరిగణనలోకి తీసుకోవడం లేదు. పిల్లలు చాలా రోజుల తర్వాత బడులకు రావడంతో ఈ నెల​మొదటి వారం మొత్తం స్టూడెంట్లు బడులకు వచ్చేలా మోటివేట్ చేయడానికే సరిపోయిందని టీచర్లు చెప్పారు. వారం, పది రోజుల నుంచే అసలు పాఠాలు మొదలు పెట్టామని తెలిపారు. ఈ క్రమంలో జనవరి10లోపు సిలబస్ ఎలా పూర్తవుతుందని ప్రశ్నిస్తున్నారు. హడావుడిగా చెప్పే పరిస్థితి కూడా లేదంటున్నారు.

మ్యాథ్స్, ఫిజిక్స్ టఫ్..

టెన్త్ లో మ్యాథ్స్, ఫిజిక్స్  చాలా టఫ్. ఏడాదిన్నరగా బడులకు దూరంగా ఉన్న స్టూడెంట్లకు ఈ సబ్జెక్టులను అర్థం చేయించడం కష్టంగా మారిందని టీచర్లు అంటున్నారు. ఆన్​లైన్ క్లాసులు విన్నోళ్లు, అర్థం చేసుకున్నోళ్లూ తక్కువ మంది అని చెబుతున్నారు. సర్కార్ చెప్పిన గడువు జనవరి 10లోగా 90 రోజులే పని దినాలు ఉన్నాయి. అంతలోపు మ్యాథ్స్​లో 14 యూనిట్లు, ఫిజిక్స్​లో 12 యూనిట్లు పూర్తి చేయడం సాధ్యం కాదని ఆయా సబ్జెక్టుల టీచర్లు వాపోతున్నారు. ప్రస్తుతం మెజార్టీ బడుల్లో మ్యాథ్స్, ఫిజిక్స్ లో రెండు యూనిట్లే పూర్తయ్యాయని చెప్పారు. గడువులోగా 70% సిలబస్ పూర్తి చేయడమే కష్టమని, సిలబస్​ను 70 శాతానికి తగ్గించాలని ప్రభుత్వాన్ని టీచర్లు, స్టూడెంట్లు కోరుతున్నారు.