హైదరాబాద్, వెలుగు: శుక్రవారం ఒక్కరోజే శంషాబాద్ ఎయిర్పోర్టులో భారీగా బంగారం పట్టుబడింది. దుబాయ్ నుంచి శంషాబాద్ ఎయిర్పోర్టుకు చేరుకున్న ఓ మహిళ తన డ్రెస్ లోపల బంగారాన్ని దాచి తీసుకొస్తున్నట్లు గుర్తించిన కస్టమ్స్ అధికారులు ఆమెను అదుపులోకి తీసుకున్నారు. 1,287 గ్రాముల బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు. దీని విలువ రూ.67 లక్షలకు పైగా ఉంటుందని అంచనా వేశారు. దుబాయ్ నుంచి శంషాబాద్ ఎయిర్ పోర్టుకు వచ్చిన మరో ఇద్దరు ప్యాసింజర్ల నుంచి 498.20 గ్రాముల బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు. దీని విలువ సుమారు రూ.25 లక్షల 74 వేలు ఉంటుందని అధికారులు అంచనా వేశారు. ముగ్గురు ప్యాసింజర్లపై కేసు ఫైల్ చేసి దర్యాప్తు చేస్తున్నారు.