
- శంషాబాద్ ఎయిర్పోర్టులో పట్టుకున్న డీఆర్ఐ
హైదరాబాద్, వెలుగు: శంషాబాద్ ఎయిర్ పోర్టులో భారీగా బంగారం పట్టుబడింది. మెటల్ డోర్ లాక్స్లో ప్యాక్ చేసి స్మగ్లింగ్ చేస్తున్న రూ.2.37 కోట్ల విలువైన కిలో 798 గ్రాముల గోల్డ్ బిస్కెట్లను డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్(డీఆర్ఐ) అధికారులు గురువారం సీజ్ చేశారు.
గోల్డ్ స్మగ్లింగ్ చేస్తున్న ఫారిన్ ప్యాసింజర్ ను అరెస్ట్ చేశారు. షార్జా నుంచి హైదరాబాద్ శంషాబాద్ ఎయిర్పోర్టుకు వస్తున్న ఎయిర్ అరేబియా ఫ్లైట్ (జీ9 467) విమానంలో బంగారం స్మగ్లింగ్ చేస్తున్నట్టు డీఆర్ఐ ఇంటెలిజెన్స్ యూనిట్కు సమాచారం అందింది. దీంతో డీఆర్ఐ అధికారులు శంషాబాద్ ఎయిర్ పోర్టులో నిఘా పెట్టారు.
గురువారం ఉదయం ల్యాండ్ అయిన విమానంలోని ప్రయాణికుల బ్యాగేజ్ను తనిఖీ చేశారు. ఓ ప్రయాణికుడి బ్యాగేజీలో డోర్ లాక్స్ను గుర్తించారు. మెటల్ డోర్ లాక్ లోపలి భాగంలో ప్యాక్ చేసిన ఐదు గోల్డ్ బార్స్, రెండు బిస్కెట్లను స్వాధీనం చేసుకున్నారు. మొత్తం కిలో 798 గ్రాములు కాగా.. వాటి విలువ రూ.2.37 కోట్లుగా తేల్చారు. మరింత సమాచారం కోసం డీఆర్ఐ అధికారులు ప్రయాణికున్ని విచారిస్తున్నారు.