ఇన్సూరెన్స్​ చేయించి మరీ భర్త హత్య

ఇన్సూరెన్స్​ చేయించి మరీ భర్త హత్య
  • నిజామాబాద్​ జిల్లాలో ప్రియుడితో కలిసి భర్త మర్డర్​
  • రూ.50 లక్షలు క్లయిమ్ ​చేసుకోవాలని స్కెచ్​
  • వీడిన సోమారం మర్డర్ ​మిస్టరీ

తాడ్వాయి, వెలుగు: ఈ నెల 21న నిజామాబాద్​ జిల్లా సోమారం శివారులో జరిగిన మర్డర్ మిస్టరీని పోలీసులు ఛేదించారు. మంగళవారం ఎల్లారెడ్డి డీఎస్పీ శ్రీనివాసులు వివరాలు వెల్లడించారు. తాడ్వాయి మండల కేంద్రానికి చెందిన ముదాం శంకర్ భార్య లక్ష్మికి, అదే గ్రామానికి చెందిన సుర్కంటి మనోహర్​రెడ్డికి వివాహేతర సంబంధం ఉంది. శంకర్ తరచూ తాగొచ్చి భార్యతో గొడవపడేవాడు. దీంతో భర్త అడ్డు తొలగించుకోవాలని లక్ష్మి..తన ప్రియుడు మనోహర్ రెడ్డితో కలిసి మర్డర్​కు స్కెచ్​వేసింది. 

దీనికి ముందు మనోహరెడ్డి నాలుగు వేర్వేరు కంపెనీల్లో  శంకర్ పేరిట ఇన్సూరెన్స్​ చేయిం చాడు. రూ.50 లక్షలు క్లెయిమ్​ అయ్యేలా ప్లాన్​చేశాడు. తర్వాత సోమారం గ్రామానికి చెందిన జింక శ్రీనివాస్ తో కలిసి శంకర్​ను చంపడానికి రెడీ అయ్యాడు. స్కెచ్​లో భాగంగా శ్రీనివాస్.. 15 రోజుల కింద శంకర్​తో పరిచయం పెంచుకున్నాడు. ఈ నెల 21న మద్యం తాగుదామని  శంకర్​ను సోమారం శివారుకు రప్పించాడు. అక్కడ యాదమ్మతో కలిసి శంకర్​ తలపై బండరాయితో కొట్టి చంపారు. హైవే పక్క డెడ్​బాడీ పడేసి, బైక్ ​యాక్సిడెంట్​గా చిత్రీకరించారు. అనుమానాస్పద మృతి కింద కేసు నమోదు చేసిన పోలీసులు విచారణలో అది మర్డర్ ​అని కన్ఫామ్​ చేసుకున్నారు.

మృతుడి కాల్ డేటా ఆధారంగా శ్రీనివాస్, అతని భార్య యాదమ్మను అదుపులోకి తీసుకొని విచారించగా, అసలు విషయం బయటపడింది. వెంటనే లక్ష్మిని అరెస్ట్​చేశారు. పరారీలో ఉన్న మనోహర్ రెడ్డిని మంగళవారం కామారెడ్డి బస్టాండ్ సమీపంలో పట్టుకున్నారు. విచారణలో ప్రతిభ చూపిన సీఐ రామన్, ఎస్సై ఆంజనేయులను డీఎస్పీ అభినందించారు.