జంతువులను వేటాడే ముఠా అరెస్ట్.. కామారెడ్డి జిల్లా గాంధారి పీఎస్ పరిధిలో ఘటన

జంతువులను వేటాడే ముఠా అరెస్ట్.. కామారెడ్డి జిల్లా గాంధారి పీఎస్ పరిధిలో ఘటన
  •     ఎనిమిది మందిని అదుపులోకి తీసుకున్న కామారెడ్డి జిల్లా పోలీసులు
  •     ఐదు నాటు తుపాకులు, ఎయిర్​గన్ స్వాధీనం

కామారెడ్డి, వెలుగు : నాటు తుపాకులతో అటవీ జంతువులను వేటాడుతున్న ముఠాను కామారెడ్డి జిల్లా పోలీసులు అరెస్ట్ చేశారు. కేసుకు సంబంధించిన వివరాలను ఎస్పీ రాజేశ్ చంద్ర గురువారం మీడియాకు వెల్లడించారు. బుధవారం రాత్రి గాంధారి పోలీస్​స్టేషన్​పరిధిలోని మొండి సడక్​చౌరస్తా వద్ద ఎస్సై మహేందర్​ఆధ్వర్యంలో వాహనాల తనిఖీ చేపట్టారు. ఈ సమయంల రెండు బైక్ లపై వస్తున్న ఐదుగురు వ్యక్తులు పోలీసులను చూసి పారిపోయేందుకు ప్రయత్నించారు. దీంతో వారిని పట్టుకొని తనిఖీ చేయగా... నాటు తుపాకులు, గన్ పౌడర్, పొటాష్, స్టీల్​పెలెట్స్(చెర్రలు) దొరికాయి.

 అదుపులోకి తీసుకొని విచారించగా... జంతువులను వేటాడేందుకు గాంధారి మండలంలోని పారెస్ట్ ఏరియాకు వెళ్లగా వర్షం పడడంతో తిరిగి వస్తున్నట్లు తేలింది. పట్టుబడిన ఐదుగురు మూడు నెలల కింద బాన్సువాడ మండలం చిన్న రాంపూర్ గ్రామానికి చెందిన అస్లాం చావుస్​వద్ద రూ. 10 వేలకు నాటు తుపాకి కొన్నట్లు తేలింది. 

పూర్తి విచారణ జరిపిన అనంతరం గాంధారి మండలం గండివేట్ తండాకు చెందిన విస్లావత్​అరుణ్, విస్లావత్​ గోపీచంద్, అంగోత్​లక్ష్మణ్, విస్లావత్ నాను, విస్లావత్​గణేశ్, నస్రుల్లాబాద్​మండలం హాజిపూర్ గ్రామానికి చెందిన సలావత్ చందర్,  సంగారెడ్డి జిల్లా నిజాంపేట మండలం నాగధార్ తండాకు చెందిన అంగోత్ ధర్మ నాయక్,  బాన్సువాడ మండలం చిన్న రాంపూర్​వాసి అస్లాంచావూస్​ను అరెస్ట్ చేశారు. వీరి నుంచి ఐదు నాటు తుపాకులు, ఎయిర్ గన్, చెర్రలు, గన్​పౌడర్, పొటాష్, రెండు బైక్ లు స్వాధీనం చేసుకున్నారు. ఎల్లారెడ్డి డీఎస్పీ శ్రీనివాస్​రావు, సదాశివనగర్​ సీఐ సంతోష్​, ఎస్సైలు మహేందర్, నరేశ్ పాల్గొన్నారు.