భార్య పుట్టినరోజు నాడే ఉన్మాదిలా మారిన కసాయి భర్త

భార్య పుట్టినరోజు నాడే ఉన్మాదిలా మారిన కసాయి భర్త
  • కుటుంబ సమస్య విషయంలో భార్యను పొడిచి.. రెండేళ్ల కొడుకును గొంతు కోసి చంపిన భర్త
  • మాటామాటా పెరగడంతో కోపంతో దారుణానికి ఒడిగట్టిన కసాయి భర్త
  • మెయినాబాద్ మండలం కేతిరెడ్డిపల్లి గ్రామంలో ఘటన

రంగారెడ్డి జిల్లా: క్షణికావేశం.. పట్టరాని కోపం ఓ కుటుంబ క్షణాల్లో నాశనమైంది. భార్య పుట్టిన రోజు వేడుకలను బంధుమిత్రులతో కలసి సంతోషంగా జరుపుకున్న సందర్బంగా కుటుంబ సమస్యల విషయంలో భార్యా భర్తల మధ్య మాటామాటా పెరగడం దారుణానికి దారితీసింది. భార్యపై కోపంతో రగిలిపోయిన భర్త కత్తి తీసుకుని భార్య పొట్టలో పొడిచేశాడు. అంతేకాదు..  అల్లారుముద్దుగా పెంచుకున్న రెండేళ్ల కొడుకును గొంతు కోసి చంపేశాడు. నిన్న (సోమవారం) సాయంత్రం మొయినబాద్ మండలంలో కేతిరెడ్డి పల్లి గ్రామంలో జరిగిందీ దారుణం. 

మొయినాబాద్ పోలీసు స్టేషన్ పరిధిలోని కేతిరెడ్డిపల్లి గ్రామానికి చెందిన డప్పు రమేష్ హుసేనప్ప (28) గ్రామ శివార్లలోని మోత్కుపల్లి అశోక్ రెడ్డి డైరీ ఫామ్‌లో సెక్యూరిటీ గార్డుగా పనిచేస్తున్నాడు. ఇతనికి షాద్ నగర్ మండలానికి చెందిన శోభా (22 ఏళ్లు)తో పెళ్లి జరిగింది.. నిన్న సాయంత్రం శోభ పుట్టినరోజు. అల్లుడితో కలసి కూతురు పుట్టిన రోజు వేడుకలు చేసుకునేందుకు శోభ తల్లి జ్యోతి కూడా గ్రామానికి వచ్చింది. 
ఈ ముగ్గురు కుటుంబ సమస్యల విషయంలో ఒకరితో ఒకరు గొడవ పడ్డారు. ఇందులో నిందితుడు తన భార్యను ఆమె కడుపుపై పొడిచి.. అదే కోపంతో  2 ఏళ్ల వయసున్న కొడుకు దినేష్ గొంతు కోశాడు. తీవ్ర రక్తస్రావం కావడంతో రెండేళ్ల కొడుకు అక్కడికక్కడే మరణించాడు. గాయపడిన భార్య శోభను  చికిత్స కోసం చేవెళ్ల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి  అక్కడి నుండి హైదరాబాద్ ఉస్మానియా హాస్పిటల్ కి తరలించారు.