పాన్​షాప్​లో గంజాయి చాక్లెట్లు.. మునక్కా నం.1 పేరుతో అమ్మకాలు

పాన్​షాప్​లో గంజాయి చాక్లెట్లు.. మునక్కా నం.1 పేరుతో అమ్మకాలు
  • కొరియర్ ద్వారా లక్నో నుంచి సిటీకి సప్లయ్
  • ఐటీ ఉద్యోగులే టార్గెట్ గా సేల్స్
  • పాన్ షాప్ ఓనర్ అరెస్ట్.. 560 గంజాయి చాక్లెట్లు స్వాధీనం

గచ్చిబౌలి, వెలుగు: ఐటీ ఉద్యోగులే టార్గెట్ గా పాన్ షాప్ లో గంజాయి చాక్లెట్లు అమ్ముతున్న వ్యక్తిని టీ న్యాబ్ అధికారులు, గచ్చిబౌలి పోలీసులు అరెస్ట్ చేశారు.  టీ న్యాబ్ అధికారులు తెలిపిన వివరాల ప్రకారం.. అస్సాం రాష్ట్రంలోని మాతిగురి గ్రామానికి చెందిన హిలాలుద్దీన్ మజుందార్(29) రెండేండ్ల కిందట ఉపాధి కోసం సిటీకి వచ్చి నానక్ రాంగూడలో ఉంటున్నాడు. ఏడాది పాటు ఓ పాన్ షాప్ లో పనిచేశాడు. 2022లో నానక్​రాంగూడలోని  కావూరి కపిల్ హబ్ వద్ద  సొంతంగా పాన్ షాప్ పెట్టుకున్నాడు. ఐటీ కారిడార్ లో గంజాయి చాక్లెట్లకు డిమాండ్ ఉందని తెలుసుకున్న హిలాలుద్దీన్.. యూపీలోని లక్నోకు చెందిన బిప్పిన్ అనే వ్యక్తి కొరియర్ ద్వారా వాటిని తెప్పించుకునేవాడు.

 ఈ గంజాయి చాక్లెట్లను మునక్కా నం.1 పేరుతో తన పాన్ షాప్​నకు వచ్చే తెలిసిన కస్టమర్లకు అమ్మేవాడు. ఎక్స్ ప్రెస్ బీ కొరియర్ సర్వీసెస్ నుంచి గతంలో చాలాసార్లు ఈ గంజాయి చాక్లెట్లను లక్నో నుంచి తెప్పించుకున్న హిలాలుద్దీన్.. వాటిని ఎక్కువ రేటుకు అమ్మేవాడు. దీని గురించి తెలుసుకున్న టీ న్యాబ్ అధికారులు గచ్చిబౌలి పోలీసులతో కలిసి హిలాలుద్దీన్ పాన్ షాప్ పై దాడులు చేశారు. 2,800 గ్రాముల 560 గంజాయి చాక్లెట్లను స్వాధీనం చేసుకున్నారు. హిలాలుద్దీన్ ను అరెస్ట్ చేసి రిమాండ్ కు తరలించారు. 

కోకాపేటలో మరొకరు..

గండిపేట: గంజాయి చాక్లెట్లను తరలిస్తున్న వ్యక్తిని శంషాబాద్ ఎక్సైజ్ పోలీసులు అరెస్ట్ చేశారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. కోకాపేటలోని లేబర్ సైట్ లో రాంకీ కన్ స్ట్రక్షన్స్ ప్రైవేట్ లిమిటెడ్ వద్ద గంజాయి చాక్లెట్లను తరలిస్తున్న ఒడిశాకు చెందిన సోమ్యా నాయక్ ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అతడి నుంచి 3.6 కిలోల గంజాయి చాక్లెట్లను స్వాధీనం చేసుకున్నారు. నిందితుడిని రిమాండ్ కు తరలించారు.