వామ్మో వీడు మామూలోడు కాదు.. ప్రేమ పేరుతో ఏకంగా 20 మంది అమ్మాయిలను ట్రాప్ చేశాడు. రహస్యంగా వారి ఫొటోలు, వీడియోలు తీసి బెదిరింపులకు పాల్పడుతూ లక్షలు వసూలుచేశాడు. ధనవంతుల ఇండ్లలో పనిచేసే పనిమనుషులు, సెక్యూరిటీ గార్డులను పావుగా వాడుకొని మోసాలకు పాల్పడుతున్నాడు. పాపం పండటంతో పోలీసులకు చిక్కి కటకటాలు లెక్కిస్తున్నాడు. హైదరాబాద్ లో 20 మంది మైనర్లను ప్రేమ పేరుతో మోసం చేసి ఆపై బ్లాక్ మెయిల్ చేస్తూ డబ్బులు దండుకుంటున్న యువకుడిని బాగోతం ఓ మైనర్ బాలిక పేరెంట్స్ ఫిర్యాదుతో వెలుగు చూసింది.
చంద్ర శేఖర్ ఆజాద్. అలియాస్ అర్జున్ అనే నిందితుడు.. సోషల్ మీడియా ద్వారా ధనిక కుటుంబాలకు చెందిన అమ్మాయిలను ట్రాప్ చేసి ప్రేమపేరుతో మోసం చేసి బ్లాక్ మెయిల్ చేస్తున్నట్లు ఆరోపణలతో పోలీసులు అరెస్ట్ చేశారు. సెక్యూరిటీ గార్డులు, తోటమాలి వంటి స్థానికులతో పరిచయాల ద్వారా సమాచారం సేకరించి బాధితులను లక్ష్యంగా చేసుకున్నట్లు పోలీసుల విచారణలో తేలింది.లగ్జరీ కార్డు, కాస్ట్ లీ స్యూట్ లో ఫోటోలు షేర్ చేస్తూ పలుకుబడి ఉన్నవాడిలా పరిచయం చేసుకుని మోసం చేస్తున్నట్లు గుర్తించారు. ఒకసారి నమ్మిన తర్వాత వారిని ట్రాప్ లోకి దించేవాడు.
గత రెండేళ్లలో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా 20 మందికి పైగా మైనర్లను మోసం చేసి ఉండొచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు. జూబ్లీ హిల్స్కు చెందిన 15 ఏళ్ల బాలిక తల్లి ఫిర్యాదుతో ఈ కేసు వెలుగులోకి వచ్చింది. ఫిర్యాదు ఆధారంగా పోలీసులు పోక్సో చట్టం కింద కేసు నమోదు చేసి నిందితులను అరెస్టు చేశారు.
ఆజాద్ మొదట ఇన్స్టాగ్రామ్ ద్వారా ఆ అమ్మాయిని సంప్రదించాడని, రాత్రిపూట ఆమె ఇంటికి కూడా వెళ్లాడని దర్యాప్తు అధికారులు తెలిపారు. బాధితురాలి తల్లి ఫిర్యాదు ప్రకారం..బాలికను బెదిరించి, ఆమె ఇంటి నుంచి రూ.29 లక్షలు తీసుకోవాలని బలవంతం చేసినట్లు ఆరోపణలు ఉన్నాయి. ఇందులోంచి రూ.13 లక్షలను నిందితుడికి ఇచ్చారు. ఆ ఇంట్లో పనిచేసే డ్రైవర్ భార్య సరస్వతి అనే మరో వ్యక్తి కూడా ఈ సంబంధాన్ని బయటపెడతామని బెదిరించి డబ్బులు వసూలు చేసినట్లు ఆరోపణలు ఎదుర్కొంటోంది.
పోలీసుల దర్యాప్తులో ఇలాంటివే మరికొన్ని కేసులు వెలుగులోకి వచ్చాయి. వాటిలో నార్సింగి ప్రాంతంలో జరిగిన ఒక ఇన్సిడెంట్ లో మరో యువతిని ప్రలోభపెట్టి, లైంగికంగా వేధించి, బ్లాక్మెయిల్ చేసినట్లు ఆరోపణలు ఉన్నాయి. బాధితులను హోటళ్లకు, ఇతర ప్రదేశాలకు తీసుకెళ్లి, ఆ తర్వాత వారి రహస్య ఫోటోలు, వీడియోలను ఉపయోగించి డబ్బు, విలువైన వస్తువులను బలవంతంగా వసూలు చేశారని అధికారులు తెలిపారు.
నిందితుడిని జ్యుడిషియల్ కస్టడీకి పంపి, ఈ కేసులో బాధితులు ఇంకెవరైనా ఉన్నారా అనే కోణంలో దర్యాప్తు కొనసాగిస్తున్నారు పోలీసులు.

