పంజాగుట్ట, వెలుగు : హైదరాబాద్ మేనేజ్మెంట్ అసోసియేషన్ 53వ వార్షిక అవార్డుల ప్రదానోత్సవ కార్యక్రమం ఐటీసీ కాకతీయ హోటల్లో ఘనంగా జరిగింది. వేడుకకు త్రిపుర గవర్నర్ నల్లు ఇంద్రసేనారెడ్డి ముఖ్య అతిథిగా, హైకోర్టు జస్టిస్ సురేపల్లి నంద విశిష్ట అతిథిగా హాజరయ్యారు. త్రిపుర గవర్నర్ శ్రీ ఇంద్రసేనారెడ్డి నల్లు మాట్లాడుతూ మేనేజ్మెంట్ అనేది వ్యాపార సంస్థలకే పరిమితం కాదని, అది ప్రతి ఒక్కరి దైనందిన జీవితంలో భాగమన్నారు. జస్టిస్ సురేపల్లి నంద మాట్లాడుతూ..డిజిటల్ యుగంలో న్యాయవ్యవస్థ, మేనేజ్మెంట్ విధానాలు, ఏఐల మధ్య సమన్వయం పెరగాల్సిన అవసరం ఉందన్నారు.
హెచ్ఎంఏ అధ్యక్షుడు అల్వాల దేవేందర్ రెడ్డి మాట్లాడుతూ నేషనల్ఎడ్యుకేషన్పాలసీ 2020, అంతర్జాతీయ నైపుణ్యాభివృద్ధి ప్రమాణాలకు అనుగుణంగా విద్యార్థులను భావి కార్పొరేట్ రంగానికి సిద్ధం చేసేందుకు 'సక్షం' అనే ప్రత్యేక కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఈ సందర్భంగా పలు రంగాల్లో విశిష్ట సేవలందించిన 13 మందికి అవార్డులు అందజేశారు. భారత రక్షణ, సాంకేతిక రంగాలను బలోపేతం చేయడంతో పాటు క్షిపణి, వ్యూహాత్మక వ్యవస్థల అభివృద్ధిలో అత్యుత్తమ సహకారం అందించినందుకు డీఆర్డీవో డైరెక్టర్ జనరల్ యు. రాజబాబుకు లైఫ్టైమ్ అచీవ్మెంట్ అవార్డు, జర్నలిజంలో విశిష్ట సేవలు అందిస్తూ, హెచ్ఎంఏ ఆశయాలకు మద్దతుగా నిలుస్తున్న సీనియర్ జర్నలిస్ట్ సురేష్ కొచ్చాటిల్ కు హెచ్ఎంఏ మెంబర్ ఆఫ్ ది ఇయర్ అవార్డు అందజేశారు.
