హైడ్రా డౌన్ డౌన్ అన్న గొంతులే నేడు సపోర్ట్ చేస్తున్నాయి. వద్దని ధర్నాలకు దిగిన వాళ్లే ఇవాళ శభాష్ అంటూ ర్యాలీలు చేపడుతున్నారు. ప్రభుత్వ స్థలాలు, చెరువులు, కుంటలు, పార్కులను కాపాడుతుండటంతో హైడ్రాకు మద్దతు రోజు రోజుకు పెరుగుతోంది. 2025 నవంబర్ 05 వ తేదీన మణికొండలో అభినందన తెలిపిన నగర జనం.. 6వ తేదీన హైదరాబాద్ సిటీ వ్యాప్తంగా హైడ్రాను సపోర్ట్ చేస్తూ ర్యాలీలు చేయడం విశేషం.
ఇటీవల భారీ వర్షాల కారణంగా హైదరాబాద్ లో వచ్చిన వరద ముప్పు తప్పించిన హైడ్రాకు ధన్యవాదాలు తెలిపుతూ ర్యాలీలు చేస్తున్నారు కాలనీవాసులు. అమీర్పేట, ప్యాట్నీ పరిసర ప్రాంతాల్లో ర్యాలీలు, ప్లకార్డులతో అభినందనలు తెలిపారు. మైత్రీవనం దగ్గర కూడా హైడ్రాకు మద్దతుగా మానవహారం కార్యక్రమం చేపట్టారు స్థానికులు. 5 సెంటీమీటర్ల వర్షానికే మునిగిపోయే కాలనీలకు హైడ్రా ఉపశమనం కల్పించిందని కొనియాడారు. 15 సెంటీమీటర్ల వర్షం కురిసినా నీరు నిలవలేదని ఆనందం వ్యక్తం చేశారు.
అమీర్పేట, శ్రీనివాస్నగర్, గాయత్రినగర్, కృష్ణనగర్, అంబేద్కర్నగర్ ప్రజలు హైడ్రాపై ప్రశంసల వర్షం కురిపించారు. భూగర్భ పైపులైన్లలో పూడిక తీయడంతో డ్రైనేజీ సమస్యలు తీరినట్లు తెలిపారు. సీఎం రేవంత్రెడ్డి ప్రత్యక్షంగా పర్యటించి హైదరాబాద్ లో ఉన్న వరద సమస్యను తెలుసుకున్నారని.. బాధ్యతలు హైడ్రాకు అప్పగించారని చెప్పారు. హైడ్రా కమిషనర్ రంగనాథ్ పర్యవేక్షణలో సమస్యల పరిష్కారం జరిగిందని ప్రజలు తెలిపారు.
హైడ్రా వ్యవస్థను తెచ్చిన సీఎం రేవంత్రెడ్డికి ధన్యవాదాలు తెలిపారు ప్రజలు. ప్యాట్నీ నాలాను విస్తరించి ఏడెనిమిది కాలనీలకు వరద ముప్పు నివారణ తొలగించాలని కోరిన వెంటనే హైడ్రా సమస్యను పరిష్కరించింది చెప్పారు. ప్యాట్నీ వద్ద 15 అడుగుల నాలా ఇప్పుడు 70 అడుగుల వెడల్పులోకి విస్తరణ చేయడంపై అభినందనలు తెలిపారు. 30 ఏళ్ల సమస్యను హైడ్రా పరిష్కరించిందని కాలనీ వాసులు ప్రశంసలు కురిపించారు.
ప్రతి వర్షం సమయంలో కార్లు మునిగిపోయే పరిస్థితులు ఈసారి లేకపోవడంపై సంతోషం వ్యక్తం చేస్తున్నారు. దశాబ్దాల సమస్యకు శాశ్వత పరిష్కారం చూపిన హైడ్రాకు ప్రజలు ఈ సందర్భంగా శుభాకాంక్షలు చెప్పారు.
