కరోల్ గజీ అమెరికన్ ప్రెస్ ఫొటోగ్రాపర్. వాషింగ్టన్ పోస్ట్లో ఫొటో జర్నలిస్ట్గా పని చేసింది. జర్నలిజంలో అత్యుత్తమ అవార్డు ‘పులిట్జర్’ గెలుచుకున్న ఫొటో జర్నలిస్ట్ కరోల్. ఒక్కసారి కాదు నాలుగుసార్లు ‘పులిట్జర్’ అవార్డు గెలుచుకుంది. ఈ ఘనత సాధించిన మొదటి జర్నలిస్ట్. నాలుగు పులిట్జర్ అవార్డులు గెలుచుకున్న అయిదుగురిలో ఆమె ఒకరు. ‘ప్రకృతి విపత్తులు, యుద్ధం, అంతర్యుద్ధం, అల్లర్లు, ఆందోళనల’ సమయాల్లో అనేక ప్రాంతాలకు పోయి ప్రజల కష్టనష్టాలను ఈ ప్రపంచానికి తెలియజేసిందామె. సిటీలో ప్రారంభమయ్యే ‘ఇండియా ఫొటోగ్రఫీ ఫెస్టివల్ 2019’లో పాల్గొనేందుకు హైదరాబాద్ వచ్చింది కరోల్. ఇండియన్ ఫొటో జర్నలిస్ట్లు మంగళవారం ఆమెకు ఆత్మీయ స్వాగతం పలికారు. వృత్తిలో రాణించడం కోసం ఆమె చేసిన కృషిని, మెలకువలను స్థానిక జర్నలిస్టులతో పంచుకున్నదామె.


